Showing posts with label మట్టల ఆదివారము. Show all posts
Showing posts with label మట్టల ఆదివారము. Show all posts

భస్మ బుధవారం - శ్రమ దినాలు (Ash Wednesday - Lent Days)

భస్మ బుధవారం - శ్రమ దినాలు 

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


💥 భస్మ బుధవారం : శ్రమ దినాలు(లెంట్) యొక్క ప్రారంభ దినమును (లేదా) ఏటేటా వివిధ తేదీల్లో వచ్చే ఈస్టర్ పండుగకు సరిగ్గా 40 దినాలకు ముందు వచ్చే బుధవారమును భస్మ బుధవారం అంటారు. 

▪️ దీని అధికారిక నామం - The Day of Ashes అనగా నొసటిపై బూడిద వ్రాసుకొనే రోజని అర్థం. 

▪️ ఆరోజు ప్రతి ఒక్కరు నుదుట పైన బూడిదతో శిలువ గుర్తును ధరిస్తారు.

▪️ విభూతి బుధవారం, బూడిద బుధవారం అని అందురు.


💥 శ్రమ దినాలు/ శ్రమ కాలం : ఈస్టర్‌కు ముందు 40 రోజుల కాలమును శ్రమ కాలం అని పిలువబడేది. దీని అధికారిక నామం - Lent అనగా బుధవారం నుండి అనగా భస్మ బుధవారం ఈస్టర్ వరకు 40 వారపు రోజులలో పాటించే ఉపవాసం మరియు ఒకరి పాపాలకు పశ్చాత్తాపం చెందే కాలం.


🔴 భస్మ బుధవారమనేది శ్రమ దినాలలో ప్రారంభ దినం.


✅  ఎవరు చేస్తారు?

నేటి సమాజంలో క్రైస్తవులమని పిలువబడుతున్న లూథరన్లు, సి.ఎస్.ఐ, మెథడిస్టులు, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, రోమన్ కాథలిక్కులు, వీరి నుండి వివిధ శాఖలుగా వ్యాప్తి చెందినవారు, ఆంగ్లికన్ తెగలకు చెందిన ఆంగ్లికన్ క్రైస్తవులు, తూర్పు ఆర్థోడాక్స్ క్రైస్తవులు వీరు "గ్రేట్ లెంట్" అని పిలువబడే లెంట్‌ను పాటించేవారు. నేటికి ఇతర ప్రొటెస్టెంట్ సంఘాలవాళ్ళు కూడ వీటిని ఆచరించుట మనం చూస్తున్నాము.


ఏ రోజు చేస్తారు?

ఈస్టర్ యొక్క ఆదివారానికి ముందు 40 రోజులు లెక్కించి(6 ఆదివారాలు మినహాయించి అనగా లెక్కించకుండా) చేస్తారు. ఇవి ఏటేటా ఫిబ్రవరి 4 నుండి మార్చి 11 మధ్య అనగా ఈస్టర్ యొక్క తేదీని బట్టే నిర్ధారణ చేసుకొని చేస్తారు. ఈస్టర్ కోసం తెలుసుకోవాలంటే మేము ముందుగా వ్రాసిన ఈస్టర్ క్లిక్ చేయు
అను అంశమును ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు.


ఎప్పుడు ప్రారంభం అయ్యింది?

మన పరిశుద్ధ గ్రంథములో ఎటువంటి ప్రస్తావన లేనప్పటికీ సంఘము ప్రారంభమైన 300సం. తరువాత అనగా 4వ శతాబ్దంలో ప్రారంభమైనదని నమ్మేవారు సంఖ్యా ఎక్కువగా కలదు. మరికొందరేమో 11వ శతాబ్దంలో ప్రారంభం అయ్యిందనీ చెప్తారు. ఇంకొందరు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రారంభించిన 5వ శతాబ్దపు పోప్ గ్రెగొరీ ది గ్రేట్ అనే వ్యక్తి ప్రవేశపెట్టారని చెప్పుకొనేవారు కూడా లేకపోలేదు.


▪️  శ్రమ దినాలు యొక్క మూలాలు మరియు ప్రారంభ చరిత్ర క్రీ.శ. 325లో నైసియా కౌన్సిల్ తర్వాతనే... 

▪️ క్రీ.శ. 333 ≈ 6 రోజులుగా చేసుకొనేవారు.

▪️ క్రీ.శ. 334 ≈ 46 రోజులుగా ప్రారంభం. 

▪️ క్రీ.శ. 390 ≈  శ్రమ దినాలు కొనసాగించుట కొరకు ముందుగా భస్మం బుధవారంగా జరుపడం ప్రారంభించారు.

▪️ ఆనాటి నుండే బూడిదెకు ఓలీవనూనె కలిపి నుదిటిపై శిలువ గుర్తు ఆకారం వేసుకొనే ఆచారం మొదలైంది. 


ఎందుకు భస్మ బుధవారం అన్నారు?

ఈస్టర్ తేది నుండి వెనుకకు 40 రోజులు లెక్కిస్తే(ఆదివారాలు మినహా...) వచ్చే వారం బుధవారం కాబట్టి ఈ రోజును భస్మ బుధవారం అన్నారు. అదే మంగళవారం వస్తే భస్మ మంగళవారం అనుండేవారేమో! 


ఎందుకు శ్రమ దినాలు అన్నారు?

భస్మ బుధవారం నుండి  ఈస్టర్ వరకు వచ్చే 40 వారపు రోజులలో వారు పాటించే ఉపవాసం మరియు ఒకరి పాపాలకు పశ్చాత్తాపం చెందే, దాన ధర్మాలు చేసే ఈ కాలాన్ని శ్రమ దినాలు అన్నారు. మునుపు బాప్టిస్ట్ సంఘ సభ్యులు తమ బాప్తిస్మం రోజుకు ముందు 40 రోజులు ఉపవాసం ఉండాలని అనుకొని జరిగించే ఈ ఆచారం కాస్త ఇప్పుడు ఈస్టర్ కి ముందు 40 రోజులు ఉపవాసం ఉండటం ఆచారంగా మారిపోయింది. 


ఎందుకు చేసేవారు? 

 పైన తెలిపిన ఆయా సంఘాలు వారు నుదుటికి సిలువ గుర్తు బూడిదను పూసుకొని, 40 దినాలు ఉపవాస, ప్రార్థనలో, దాన ధర్మాలు వలన ఇలా తమ ఆత్మలను శుద్ధి చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరవుతారని, మన్నైన నీవు మరలా మంటికే చేరతావు గనుక నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది రక్షించబడమని ఒకరినొకరు హెచ్చరిక చేసుకొనుటకు చేస్తున్నారనే నానుడి కలదు. మరికొందరు ఏమో పాత నిబంధనలో కొంత మంది బూడిదలో కూర్చొని విలపించినట్లు, దుఃఖించినట్లు, గోనెపట్ట కట్టుకొని ఉన్నట్లు ఉండే ఆయా సందర్భాలను ఆధారం చేసుకుని చేస్తున్నామని చెప్పుకొనేవారు కూడా లేకపోలేదు.


ఎలా చేసేవారు?

మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు "ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి —జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి."(యోహాను. 12:13). ఇలా ఆనాడు ఆయనను యెరూషలేములోకి స్వాగతం పలికిన సందర్భాన్ని ఆధారం చేసుకొనే ఈ మట్టల ఆదివారాన్ని ఆచరిస్తారు. ఇది ఈస్టర్ కి ముందుగాను వచ్చే ఆదివారం నాడు మరియు భస్మ బుధవారం తరువాత జరిగే పండుగ. దీని కోసం ఇక్కడ చర్చించ బోవడం లేదు కానీ ముందుగా వ్రాసిన "మట్టల ఆదివారం" క్లిక్ చేయు
అనే అంశాన్ని క్లిక్ చేసి పూర్తిగా చదవగలరు.


ప్రస్తుతం మన ప్రాంతాల్లో కూడా ఆరోజున ఖర్జూరపుమట్టలు దొరకనందున వాటి స్థానములో ఈత మట్టలను లేదా తాటి ఆకులను పట్టుకొని వాటికి పూలు గుచ్చి, హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ పాటలు పాడుతూ, బోలో యేసు మహారాజుకు జయము అంటూ వీధుల్లో తిరుగుతారు. ఇలా పట్టుకొని తిరిగిన వాటిని తిరిగి వారి సంఘాల్లో, ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా ఉండటం వారికి శుభప్రదమని భావిస్తారు. 


ఇలా ఎండిపోయిన మట్టలన్నీ కాల్చి, బూడిద చేస్తారు.  ఇలా కాల్చి బూడిద చేయడం అనేది కొందరు ఈస్టర్ ఆదివారానికి మరుసటి రోజే చేస్తే, మరికొందరు ఈస్టర్ నుండీ 50వ రోజున జరిగే పెంతెకోస్తు పండుగ దినాన చేస్తారు. ఇలా కాల్చి బూడిద చేసి దానిని సేకరించి, నిలువ చేస్తారు. అలా నిల్వ చేసిన బూడిదను మరుసటి సంవత్సరమున భస్మ బుధవారం రోజున ఉపయోగించేవారు. 


🧍🏿‍♂️ ఎలా చేసేవారంటే?     గత సంవత్సరమున సేకరించిన  బూడిదనే ఈ భస్మ బుధవారం నాడు ఆయా సంఘాపు పాస్టర్ లేదా బిషప్ వ్యక్తులు సిలువ ఆకారంలో విశ్వాసుల నుదుటిపై పూసి, వారి తలపై చల్లుతూ "మన్నైన నీవు మరలా మంటికే చేరతావు గనుక నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది రక్షించబడమని" చెప్పుతారు. ఈ పని బిషప్పులూ, పాస్టర్లే చేస్తారు. మరికొన్ని సంఘాల్లో ఐతే అక్కడ  విశ్వాసులే బూడిదను హోలీ వాటర్ అని చెప్పబడే నీళ్ళని లేదా ఒలీవ నూనె ని కలిపి నుదుట తమ నుదుటిపై సిలువ ఆకారపు గుర్తుగా పూసుకొంటారు. ఇలా చేస్తూ ఈ బూడిద పశ్చాత్తాపానికీ, మారుమనస్సుకీ గుర్తు అనీ, అందుకే దీనిని ఆచరిస్తున్నాము అనీ చెప్తారు.


బైబిల్ ఏమి సెలవిస్తుంది?

                   ప్రియమైన సహోదరులారా... ఈ భస్మ బుధవారం & శ్రమ దినాలనేవి మాత్రమే కాక మనం ఏమి చెయ్యాలనుకున్నా, ఏమి చేసిన సరి ఈ క్రింది మూడు విషయాలను మన మదిలో పెట్టుకొని చేయాలి. అదేమనగా...,

1) యేసుక్రీస్తు బోధలలో చెప్పబడిందా?

2) ఆదిమ అపోస్తులుల బోధలో చెప్పబడిందా?

3) ఆదిమ క్రీస్తు సంఘము అనుసరించిదా?

                  మన పరిశుద్ధ గ్రంథములో వీటిని గూర్చి రవ్వంతైన సమాచారం లేదు. యేసు గానీ, అపోస్తులలు గానీ చేసినట్టు గానీ, ఆజ్ఞాపించినట్టుగా గానీ ఒక్క ఆధారం లేదు, కేవలం క్యాథలిక్ సంఘపు బోధలే కానీ దైవ బోధ కాదు. మరి నేడు కొన్ని సంఘాల్లో ఎలా ఇంతలా వ్యాప్తి చెందాయంటే కేవలం దైవ గ్రంథాన్ని సరిగ్గా విభజన చేసి ఆలోచన చేయకపోవటం/ నేర్చుకోకపోవడమే/ నేర్పించకపోవడమే దీని ప్రధాన సమస్య.


🔵 భస్మ బుధవారాన్ని ఆచరించే వారు నుదుట బూడిద పూసుకునేవారు బూడిద అనేది పశ్చాత్తాపానికీ, మారుమనస్సుకీ గుర్తు అనీ భావించి అందుకే మేము దీనిని ఆచరిస్తున్నాము అనీ చెప్తారు. నిజానికి పశ్చాత్తాపం చెందడం కోసం, మారుమనస్సు పొందడం కోసం ఒక రోజు కేటాయించాల్సిన అవసరం ఏం ఉంది? అలా చెయ్యమని వాక్యంలో ఎక్కడ చెప్పబడింది?  క్రొత్త నిబంధన ప్రకారం ఏ మనుష్యుడైన పాపం విషయంలో పరిశుద్ధాత్మ చేతనే మొదటగా ఒప్పించబడతాడు. "అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.౹ ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.౹ లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొన జేయును.౹" (యోహాను. 16:7-11). ఇలా ఆయన చేత ఒప్పించబడి, పశ్చాత్తాపంలోకి నడిపించబడి, మారుమనస్సు పొందుకునేలా ఆయనే నీ హ్రుదయములో పొడువబడే సందేశాన్ని వినిపిస్తారు. ఒక చక్కటి ఉదాహరణకు "వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని(పొడువబడి) —సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా౹ పేతురు– మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.౹" (ఆపో.కార్య. 2:37-38). ప్రతీ క్రైస్తవుడు మారుమనస్సు పొందటమనేది నిత్య దినచర్యగా ఉండాలి. అంతేకాని దాని ఒక రోజు కేటాయించి, ఆ రోజు మట్టుకు లేక ఆ నలభై దినాల మట్టుకూ ఆచార సంబంధమైనవేవో చేసేస్తే సరిపోతుంది అని చెప్పడమనేది పూర్తిగా బైబిల్ కి విరుద్ధమైన బోధ అగును కదా!


"యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది." (లూకా. 24:47) "ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.౹" (ఆపో.కార్య. 17:30) "...దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?౹" (రోమా. 2:4) "నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.౹" (ప్రకటన. 2:5) "మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని..." (ప్రకటన. 2:21). 


నేటి విశ్వాసుకులను వారి సంఘాల్లో భస్మ బుధవారం చేయుమని శోధించేవారు గ్రంధములో ఎన్నుకొనే కొన్ని వచనాలు ఏమనగా.., యోబు. 42:6; దానియేలు. 9:3; యోనా. 3:5-6; ఎస్తేరు. 4:1-3 వాటిని గూర్చి బోధిస్తూ వారికి వలె మేము నేడు చేస్తున్నామని తమ్మును తాము సమర్ధించుకొనే వారు లేకపోలేదు. అటువంటి వారికి సమాధానమేమనగా.., వారు కారణాలు బట్టి, పరిస్థితులు బట్టి, వారు దుఃఖిస్తూ, దేవున్ని వేడుకొంటూ, తమకు తామే బూడిదలో కూర్చొని మారుమనస్సు పొందే కార్యక్రమం చూడగలం. అంతేకాని సంవత్సరాంతం చేసే పనులకు మారుమనస్సు పొందుదాం అంటూ ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొని, అందరూ కూడుకొని, పశ్చాత్తాపపడట్లేదు. ఇలా చేయుటలో దైవ దృష్టికి శూన్యమే కదా!. మారుమనస్సు పొందాలి అనుకునే వ్యక్తి తనకు తాను వ్యక్తిగతంగా చేసే పని అది. అంతేకాని నేటి వలె "ఈ రోజు భస్మ బుధవారం కాబట్టే మనమంతా సంఘముగా కూడుకొని, అందరూ కలిసి పశ్చాత్తాపడదాం, ఈరోజే మారుమనస్సు పొందుదామని" ఇలా చేసినట్లుగా పైన పాత నిబంధనలో వచనములు చెప్పలేదని గమనించాలని కోరుచున్నాను. 


ఓ చదువరి... ఇన్ని మాటలడుకున్నప్పటికి కూడా ఇంకా పాత నిబంధన భక్తులకు వలె మేము చేస్తున్నాము, మా పాస్టర్ చెప్పేది చేస్తున్నాను, పాత నిబంధనలో ఉంది కదా ఇక తప్పేంటి అని నీకు నీవు సమర్ధించుకోవడానికి ప్రయత్నం చేస్తే... "మరి వారి వలె మీరెందుకు  గోనెపట్ట కట్టుకొని, బూడిదలో కూర్చుకోవడం లేదు? నుదుటికి సిలువ గుర్తు ఆకారములో బూడిద పూసుకొని అలా అందరూ తల మీద జల్లుకోమని బైబిల్లో ఎక్కడ ఉంది? గత సంవత్సరం మట్టల ఆదివారం లో ఉపయోగించే మట్టల యొక్క బూడిదనే భస్మ బుధవారం నాడు పూసుకోమని బైబిల్లో ఎక్కడ ఉంది?" వారికి వలె మేము చేస్తున్నామని అపోహ పడుతున్న మీ ఆలోచనలకి నా ప్రశ్నలను లేవనెత్తి ఆలోచింపజేశాను తప్పా మిమ్మల్ని అలా చేయమని కోరుట లేదని గమనించగలరు.


🔵 శ్రమ దినాలు(లెంట్ డేస్) ఆచరించే వారుకి దాని అర్థం గానీ, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎన్ని రోజులు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి... అనే విషయాలు గూర్చి బైబిల్ లో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. మరి క్రీస్తుయేసు నందు ఉన్నవారు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో అనే విషయాలను దేవుడే ఎంతో స్పష్టంగా గ్రంథము రూపములో వ్రాసి అనుగ్రహించినప్పుడు, అందులో ఉన్నవి తెలుసుకొని అలా చేస్తే సరిపోతుంది కానీ బైబిల్ లేనివాటిని తిరిగి బైబిల్ కి కలిపి, చెరిపి చేసే అధికారం ఎవరికి ఇవ్వబడలేదు. కాబట్టి బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించనది ఏదైనా సరి అది కేవలం మనుషులు కల్పించిన ఆచారాలే అగును కదా. "మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా — ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి" (మత్తయి. 15:6-7). మనుషులు కల్పించిన ఆచారమే ఈ శ్రమ దినాలు. ఇలా వీటిని చేయమని బోధించే వారు, వీటి ద్వారా ఆరాధన చేసేవారు వ్యర్థమైన ఆరాధికులై యుందురు.


 యేసు బాప్తీస్మం పొందిన పిమ్మట(మత్తయి. 3:14-17) పరిచర్య ప్రారంభించే ముందు ఆయన 40 దినాలు చేసిన ఉపవాసాన్ని(మత్తయి. 4:1-2) ప్రామాణికం చేసుకొని మేము నేడు శ్రమ దినాలను(లెంట్ డేస్) ఆచరిస్తున్నాం అని చెప్పుకొనే వారు లేకపోలేదు. "బాప్తీస్మం ముందు అనగా 30 సం. వ్యవధిలో గానీ మరియు బాప్తీస్మం అనంతరం అనగా 33 1/2  సం. కాల వ్యవధిలో ఏటేటా ఆయన 40 దినాలును(లెంట్ డేస్) పాటించినట్టుగా ఒక్క వాక్య రుజువు ఉందా? లేదు కదా" కాబట్టి యేసు చేశారు కాబట్టి మేము చేస్తున్నమని ఎలా సమర్ధించుకోగలరు? దయచేసి ఆలోచించమని మనవి. 


ప్రియ చదువరి... అనేకమంది బోధకులు గ్రంథాన్ని సరిగ్గా విభజన చేతకాకే(2 తిమోతి. 2:15) తమకు నచ్చిన రీతిలో వాక్య వక్రీకరించి, వారి పద్ధతులను, ఆచారాలను, ఆలోచనలను బైబిల్ కి కలపడం వలనే ఈ భస్మ బుధవారం, శ్రమ దినాలు, మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, సమాధుల పండుగ, క్రిస్మస్...Etc. వంటివి పుట్టుకు వచ్చాయి. యేసుక్రీస్తు బోధ కంటే, ఆదిమ అపోస్తులుల బోధ కంటే, ఆదిమ క్రీస్తు సంఘము అనుసరించే బోధ కంటే ఇంకా గొప్పగా దేవునికి భక్తి చెయ్యాలనే వారి ఆలోచనలు వలనే ఇలాంటి పండుగలు పుట్టుకు వచ్చాయని గుర్తించుకో. మీలో ఏ ఒక్కరూ కూడా పరమతండ్రిని వ్యర్థంగా ఆరాధించేవారయ్యుండకూడదనే ఈ సంగతులను మీకు వ్రాసి ఇచ్చుచున్నాము. 

▪️ 2 తిమోతి 3:14: "... నీవు నేర్చుకొని రూఢియని తెలిసి కొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.౹"

▪️ 2 థెస్స 2:15 - "కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి."

మీ ఆత్మీయులు

WhatsApp Join Us   Telegram Join Us

మట్టల ఆదివారము! (Palm Sunday)

మట్టల ఆదివారము! (Palm Sunday)

క్రైస్తవులని పిలువబడుతున్న వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రియులారా, నేటి క్రైస్తవులు చేయుచున్న అనేక వ్యర్థమైన పండుగలను గూర్చి మునుపు వ్రాయబడిన లేఖనానుసారమైన అంశముల ద్వారా తెలుసుకున్నాము. అటువంటి పండుగలలో ఈ మట్టల ఆదివారము కూడా ఒకటి కనుక లేఖనానుసారముగా గ్రంధము ఆధారముగా ఈ పండుగను గూర్చి ఆలోచన చేద్దాము.

వాస్తవానికి పరిశుద్ధ గ్రంధములో “మట్టల ఆదివారము” అనే పదమును కూడా మనము చూడలేము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన పండుగలలో కూడా ఈ మట్టల ఆదివారమనే పండుగ అనేది లేదు.

పర్ణశాల పండుగ చేయునప్పుడు మొదటి దినమున ఈత మట్టలను, మొదలగు కొమ్మలను తెచ్చి యెహోవా సన్నిధిని ఉత్సాహించమని ఆజ్ఞాపించియున్నారు కాని ఆదివారమని లేక విశ్రాంతి దినము మరుసటి రోజని లేక మట్టల పండుగని చేయమని కాని ఆజ్ఞాపించలేదు.


మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను, గొంజి చెట్లకొమ్మలను, కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. – (లేవీ.కాం. 23:40).

NOTE: ధర్మశాస్త్రములో మనము ఎంత వెతికినా మనకు ఈ పండుగను గూర్చిన ఆనవాలు కనిపించదు.


పరిశుద్ధ గ్రంథములోని క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, యోహాను సువార్తలలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనెక్కి వీధులలో ఘనపరచబడినపుడు అక్కడ ప్రజలు కొందరు ఖర్జూరము మట్టలను, మరికొందరు తమ దగ్గరున్న బట్టలను నేల మీద పరిచి ఆయనను ఘనపరచినట్టుగా గ్రంధమందు చూడగలము కాని “మట్టల ఆదివారము” అని ఒక ప్రత్యేకముగా ఈ పండుగను చేసినట్టుగా చూడలేము.

[గమనిక : ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని తన శిష్యులకు ఆజ్ఞాపించని యెడల ఈ విషయముపై గల అవగాహన నిజముగా వారికి లేకుండకపోయెను. వారు ఆయనను ఊరేగించకుండా ఉండి ఉంటే అక్కడ ప్రజలకు కూడా పొలములోనికి వెళ్లి మట్టలు తెచ్చేంత అవసరత వారికి లేకపోవును].

వారు ఆ గాడిదెపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిమీద వేయగా ఆయన దానిని ఎక్కి కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు నడుచుచుండువారును వెనుక వచ్చుచుండువారును - జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాకసర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలువేయుచుండిరి. – (మత్తయి. 21:7-10, మార్కు. 11:7-11, యోహాను. 12:12-15).


ప్రియులారా, పైన తెలుపబడిన లేఖనములలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని శిష్యులకు ఆజ్ఞాపించాడు కాని "మట్టలను" గూర్చి ఆయన ఆజ్ఞాపించలేదు, తన శిష్యులకు కాని అక్కడ ప్రజలకు ప్రజలకు కాని ఆయన తెలియపరచలేదు.


యేసు గాడిదనే ఎందుకు ఎక్కెను ?



జెకర్యా ప్రవక్త ద్వారా ముదుగానే తెలియజేయబడిన ప్రవచనము నెరవేర్చుటకు.

» సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. – (జెకర్యా. 9:9).

ఎందుకనగా ధర్మశాస్త్రమును నేరవేర్చుటకై ఆయన ఈ లోకమునకు వచ్చెనను మాట సత్యము కనుక.

» ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ( వచనముల) నైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. – (మత్తయి. 5:17).


జెకర్యా ప్రవక్త తన ప్రవచనములో గాడిదను మాత్రమే ఎందుకు ఎన్నుకొనెను?



యూదులు సామాన్యముగా విజేతలను గాడిదలపై లేదా కంచర గాడిదలపై  స్వారీ చేయించుట వారి ఆచారము. అయితే రాజులు గుర్రములపై స్వారీ చేయుట మనకు తెలిసిన సంగతి కాని కొన్ని సందర్భాలలో యూదులు గాడిదలను ఎన్నుకొనుటకు గల కారణమేమిటంటే గాడిదను సమాధానమునకు సూచికగా వారు భావించుటయే ఇందుకు కారణము.

» తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. – (న్యాయాధి. 5:10).

» అంతట రాజుమీరు మీ యేలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారు డైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి,.. – (1 రాజులు. 1:33). 

[గమనిక: యేసుక్రీస్తు వారు సకల ప్రజలను తండ్రితో సమాధాన పరచుటకై యెరూషలేమునకు వెళ్లియున్నాడు కనుక ఆయన గాడిదనెక్కి పోవుట జరిగింది]

» యేసుక్రీస్తు వారు నిజముగానే సమాధానకర్తయగు అధిపతి. – (యెషయా. 9:6). 

ఎప్పుడైతే ఆయన గాడిద పిల్లనెక్కి యెరూషలేములో ప్రవేశించాడో అప్పుడే జెకర్యా ప్రవచనము నెరవేరబడింది.

» అంతట ఆయనమోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. (లూకా. 24:44).


అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను ఎందుకు ఉపయోగించారు?


యూదులు పవిత్రంగా భావించే వాటిలో ఈ ఖర్జూరపు చెట్టు ఒకటి. అంతేకాకుండా పర్ణశాలల పండుగను ఆచరించుటలో ఖర్జూరపు మట్టలకు ప్రాధాన్యతనివ్వమని దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టుగా ధర్మశాస్త్రమందు చూడగలము.


» మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను, గొంజి చెట్లకొమ్మలను, కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. – (లేవీ.కాం. 23:40).

» వారు తమ పట్టణము లన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవచెట్ల కొమ్మలను, అడవి ఒలీవచెట్ల కొమ్మలను, గొంజిచెట్ల కొమ్మలను, ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. – (నెహేమ్యా. 8:15).

ప్రియులారా, చాలామంది *యోహాను సువార్త 12:12* వచనములో “పండుగ” అని సంభోధించారు కాబట్టి అది మట్టల ఆదివారమనే భావనలో ఉన్నారు కాని అక్కడ తెలుపబడింది యూదుల యొక్క “పస్కా పండుగ” అని గ్రహించాలి. – (యోహాను. 11:55, 12:1).


నేటి క్రైస్తవుల పని ఏమి?



ఎప్పుడో యేసుక్రీస్తు వారిచే నెరవేరబడిన ప్రవచనమును జ్ఞాపకమును చేసుకుని మట్టలు పట్టుకుని వీధులవెంట తిరిగి పండుగులా ఆచరించుట నేటి క్రైస్తవుల పని కాదు. ఈ మట్టల ఆదివారమనే పండుగ ద్వారా మేము క్రీస్తు సువార్తను లోకములో ప్రకటన చేయుచున్నామని చెప్పుచూ కొందరు తమను తాము సమర్థించుకుంటున్నారు కాని నీవు నిజముగా క్రీస్తును ప్రకటన చేయాలని ఆలోచన కలిగి ఉంటే పండుగ పేరుతో కాదు సమయమందును అసమయమందును సువార్తను చేయాలి.

అంతేకాదు మనకు నచ్చినట్టిగా గ్రంధమును చదివి, లేనివి కల్పించి, లేఖనమును అపార్థము చేసికొనుచూ, అసత్యమును ప్రకటన చేయుట వలన శాపగ్రస్తులమవుతాము కాని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేము.

» వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. – (2 తిమోతి. 4:2).

» వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. – (2 పేతురు. 3:16).

» మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. – (గలతీ. 1:8).

ప్రియ సహోదరుడా, సహోదరీ, గట్టిగా చెప్పాలంటే క్రైస్తవులమైన మనకు అసలు పండుగలే లేవు. మనకున్న ఏకైక పండుగ ప్రతి ఆదివారమును తూ.చ. తప్పకుండా ఆచరించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఆయన బలియాగమును జ్ఞాపకము చేసికొనుచూ, ఆయన సిలువను గూర్చిన సువార్తను లోకమునకు ప్రకటిస్తూ,  ప్రభువు బల్లలో పాలు పంచుకొనుటయయే.


NOTE:- యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనమును మాత్రమే జ్ఞాపకము చేసుకోమని ఆజ్ఞాపించుట గ్రంధమందు చూడగలము.

★ వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. – (మత్తయి. 26:26-27).

★ వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. – (మార్కు. 14:22-23).


కాబట్టి పై వచనముల ఆధారముగా ఇతర పండుగలతో అనగా మనుష్యులు కల్పించిన పండుగలతో (శ్రమదినము, మట్టల ఆదివారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్టమస్,...) మనకు సంబంధము లేదని నిజమైన క్రైస్తవుడు ఖచ్చితముగా గ్రహించగలడు.


» మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. – (గలతీ. 4:10).

» కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. – (కొలస్సి. 2:16).


కావున, ఆలోచన చేసి, నిన్ను నీవు స్వపరీక్ష చేసుకొని సత్య బోధను అనగా అపోస్తులుల బోధని అంగీకరించాలని మీకు మనవి చేయుచున్నాను.

★ ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.  – (సామెతలు. 30:6).


మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  
The churches of Christ greet you - Roma 16:16