పరలోకమునకు ఎవరు వెళ్తారు? (Who will go to heaven?)

పరలోకమునకు ఎవరు వెళ్తారు?


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿

       

         ప్రియమైన వీక్షకుడా... ఒకసారి అకస్మాత్తుగా ఈ క్షణాన నీకు మరణం సంభవిస్తే అనంతరం(క్రీస్తు ప్రత్యక్షతలో) "పరలోకమునకు వెళ్తావా?" అనే విషయాన్ని నీవు ఎప్పుడైనా ఆలోచించావా? సరే ఇప్పుడు ఆలోచన చేయు... నీ మనస్సాక్షి ఏమి సెలవు ఇస్తుంది? ఇప్పుడు చెప్పు... నిజంగా పరలోకమునకు వెళ్తావా? అని అడిగితే వెళ్తాను అనే మాట వినిపిస్తుందని నాకు తెలుసు. మరి జాగ్రత్తగా నిన్ను నీవు వాక్య దృష్టిలో ప్రశ్నించుకుంటే...


ఈ లోకము శాశ్వతం కాదని తెలిసి కూడా ఈ లోకం కొరకే బ్రతుకుతే పరలోకమునకు వెళ్తావా? నీలో లోపము గలవాటిని(పాపపు వస్త్రాలు కలిగి) సరి చేసుకోకుండా సమయం ఇంకా ఉందిలే అనుకొని సమర్థించుకుంటూ జీవిస్తే నిజంగా పరలోకమునకు వెళ్తావా? అపోస్తులుల బోధను వినకుండా మరియు విని కూడా పరిశుద్ధముగా అనుసరించక పోతే పరలోకమునకు వెళ్తావా? సంపాదనే ప్రాణాధారమైనట్టు ఆలోచన కలిగి ఉంటే పరలోకమునకు వెళ్తావా? దుర్మార్గపు పనులు జరిగిస్తే పరలోకమునకు వెళ్తావా? నీకిష్టమైనట్టు బ్రతికితే పరలోకమునకు వెళ్తావా? క్రీస్తునందు ఉన్నానని అనుకొని ప్రాచీన స్వభావము విడువక దానినే ఇంకా హత్తుకొని జీవిస్తూ ఇది నా బలహీనత అంటే పరలోకమునకు వెళ్తావా? సహోదరుల పట్ల నటిస్తూ, ప్రేమ లేనివాడిగా(ద్వేషిస్తూ) ఉంటూ కుల, మతపరమైన విద్వేషాలు కలిగి ఉంటే పరలోకమునకు వెళ్తావా? జ్ఞానేంద్రియాలు సాధకం చేసుకొనక ఉంటే పరలోకమునకు వెళ్తావా? ఇంతకు నీకు పరలోకమునకు వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా? అసలు పరలోకము ఉందా? ఉంటే ఎవరు మాత్రమే పరలోకమునకు వెళ్తారు? అనే విషయాలు గూర్చి ఆలోచన చేయుటకై ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 


💓 "పరలోకము ఉందా?"

       అవును.. నిత్యుడగు దేవుని శాశ్వతమైన నివాస స్థలమే ఆకాశము అనగా పరలోకము. సూర్యుడుకి క్రింది భాగము భూమి, సూర్యుడుకి పై భాగము ఆకాశము (లేదా) పరలోకము. 

(యెషయా. 40:28): "నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము."

(1రాజులు. 8:30): "... నీ నివాసస్థానమైన ఆకాశమందు...."

(దానియేలు. 2:28): "...మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు..."

(ప్రసంగి. 1:3,9): "సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? ... సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.౹"


💞 పరలోకములో ఎవరున్నారు?

మన ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో చూస్తే...

👤 దేవుడు ≈ మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి: (1 కోరింది. 8:6; ఎపేసి. 4:6). ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.(మత్తయి. 23:9). పరలోకమందున్న మా తండ్రి(మత్తయి. 6:9) పరలోకమందున్న మీ తండ్రి(మత్తయి. 7:10) పరలోకమందున్న నా తండ్రి(మత్తయి. 10:32-33) 


👤 ప్రభువు ≈ మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; (1 కోరింది. 8:6). పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. (యోహాను 3:13). యేసు తప్పా ఈ భూమి మీద చనిన ఏ వ్యక్తి కూడా ఇంకా పరలోకమునకు పోలేదు...నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. (యోహాను. 6:38). 


👤ఆత్మయు ≈ మనకు ఆత్మయు ఒక్కడే; ఆయన పరిశుద్ధాత్ముడు; (ఎఫెసి. 4:5). తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును. (యోహాను. 15:26). ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు(అపోస్తలలు) పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. (లూకా. 24:49).


👥దేవదూతలు ≈ "మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.(ప్రకటన. 5:11). పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట. (1 రాజులు 22:19). నాలుగు జీవులు. (ప్రకటన. 5:6,14, 7:11). వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి. (దానియేలు. 7:10, హెబ్రీ. 12:22).


🔎 ఏ మనుష్యుడైన పరలోకమునకు వెళ్లారా?

లేదు ≈ పరలోకానికి వెళ్ళిన వాడు, పరలోకం నుండి దిగివచ్చినది యేసుక్రీస్తు మాత్రమే. పరలోకమునకు మనుష్యులు స్వయంగా ఎక్కిపోలేరని యోహాను 3:13 వచనం సూచిస్తుంది. మనుషులు పరలోకమునకు వెళ్లడానికి, అక్కడ నుండి దిగివచ్చిన ఒక మార్గం యేసు. 


పాత నిబంధనలోని విశ్వాసపు పురుషులు మరియు స్త్రీలు తమ విశ్వాసం ద్వారా దేవున్ని మెప్పించే విధముగా బ్రతికి నిద్రించినప్పటికి వారికి వాగ్దానం చేయబడిన స్థలానికి ఇంకా పొందలేదని.  దేవుడు మన(క్రైస్తవ జనం) కోసం సిద్ధం చేసిన మెరుగైనదానిని చూడటానికి వారు ఆశించారని, అది మనకు వచ్చినప్పుడు వారు మనతో పాటుగా  పరిపూర్ణులు అవుతారని అనేది హెబ్రీ. 11:39 యొక్క సమాచారం. 


పరలోకమనేది ఒక విస్తృతమైన, పరిశుద్ధమైన స్థలము. అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలగాలని(1 పేతురు. 1:3-4) మనకు స్థలం సిద్ధం చేస్తున్నానని, మనకు స్థలము సిద్ధపరచిన పిమ్మట స్వయముగా ఆయనే వచ్చి మనలను తీసుకుపోవునని, మనం తండ్రి యొద్దకు పోవుటకు యేసే మార్గం, సత్యం, జీవమని జ్ఞాపకం చేసుకో. (యోహాను. 14:2-5) ఇది యేసును నమ్మి, నోటితో ప్రభువని ఒప్పుకొని, బాప్తీస్మం పొంది, క్రీస్తు సంఘముగా చేర్చబడి, అపోస్తులుల బోధ ప్రకారంగా ఆయన మార్గములను యెరిగి అనుసరిస్తూ, బ్రతుకునుద్దేశించే వారికి మాత్రమే దొరికే గొప్ప ధన్యత. (మార్కు 16:16; అపో.కార్య. 2:36-42). నా కలలో పోయాను, నా పడక గదిలో పడుకునప్పుడు పోయాను అనే మాటలు పూర్తిగా అబద్ధం.


🔎ఎవరు ప్రవేశించుదురు?🔍


.  గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకు కొని వాటిని తెలుపు చేసుకొనేవారు మాత్రమే. 

"పెద్దలలో ఒకడు– తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.౹ అందుకు నేను– అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను– వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకు కొని వాటిని తెలుపుచేసికొనిరి.౹" (ప్రకటన. 7:13-14)


🐑 గొఱ్ఱెపిల్ల ఎవరు?

"మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి– ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.౹ … అతడు నడుచుచున్న యేసువైపు చూచి– ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను.౹" (యోహాను. 1:29,36).


🩸గొఱ్ఱెపిల్ల రక్తము?

గొఱ్ఱెపిల్ల రక్తము(క్రీస్తు రక్తము) పాపము లేని మరియు నిర్దోషమైనది, పాపముతో లేనది, దోషరహితమైన ఇట్టి అమూల్యమైన రక్తము చేతనే మనం విమోచింపబడాలనేది అనాది దేవుని యొక్క ఆనాది సంకల్పం. (1 పేతురు. 2:19-20).


👤 తమ వస్త్రములను ఉదుకు కొని?

పరిశుద్ధ పరచబడిన క్రీస్తు సంఘము వారు. పాపము లేని వారు (లేదా) తమ పాపములను(వస్త్రములను) క్రీస్తు యేసు రక్తం చేత కడుక్కునేవారు(ఉదుకు కొనేవారు).


👀 తెలుపుచేసికొనిరి?

పరిశుద్ధమైన జీవితం, భక్తికలిగిన జీవితం, దిద్దుబాటును ప్రేమించే జీవితము, పరిశుద్ధ గ్రంథమునకు లోబడే విధానం, ఇతరులకు మాదిరికరమైన ప్రవర్తన..Etc. ఇటువంటి విషయాల్లో సరిగ్గా ఉండువారే తెలుపు చేసుకొనేడివారై యుంటారు. అంతేకాని ఆత్మీయ పరిశుద్ధత లేకుండా తెల్ల బట్టలు వేసుకొని సమాజముగా కూడుకొనుట ఏమి ప్రయోజనం?.


(ప్రకటన. 22:14): "జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు.౹"

 

2. నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారు మాత్రమే అనగా నీతిమంతులు వారి క్రియాఫలం బట్టే... 

(ఎఫెసి. 2:10): "వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము."


(మత్తయి. 25:31-40): "తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు– ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు– మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును."


(1పేతురు.  3:9): "ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి."


(గలతి 3:7-9): "కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.౹ దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి— నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.౹ కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు.౹"


3 .  తమ జ్ఞానేంద్రియములను సాధకము చేసుకొనే వారు మాత్రమే

యేసును తమ నోటితో ప్రభువని ఒప్పుకొనేవారు(రోమా. 10:9-10); తమ జ్ఞానేంద్రియములను అనగా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, దేహం పైన నీవు సాధకము చేయబడాలి (లేదా) వీటి పైన క్రీస్తు మాత్రమే ప్రభుత్వం చేసే అవకాశం నీవు ఇవ్వాలి. సాధకము అంటే ఏమి చూడాలో అవే చూడాలి, ఏమి మాట్లాడాలో అవే మాటలాడాలి, ఏమి వినాలో అవే వినాలి అని అర్థం. ఇలా సాధకం చేయబడకపోతే నీవు అపవాది సంబందివే.  ఏమాత్రం పరలోకానికి ప్రవేశించలేవని గుర్తించుకో. 


(మార్కు. 9:43-47): "నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులుకలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములుకలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులుకలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు."


(1కోరింధి 9:27): "గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను."


తమ సొంత ఇంద్రియాలను సాధకం చేయలేనివాడు పరలోక ప్రవేశానికి అనర్హుడు. కాబట్టి నీ శరీరాన్ని నలుగగొట్టి దాని లోపర్చుకోవాల్సిందే లేని పక్షాన భ్రష్టతమునకు దాసుడు అవుతావు జాగ్రత్త సుమీ!.


💥 NOTE  👇

తమ ఇంద్రియాలతో సాధకము చేయబడాలనేది క్రైస్తవ జీవితానికి అవసరమైన సమాచారం. వయసు మించినప్పుడు అనగా నీకు ఇవ్వబడిన ఆయుష్షు కాలానికి దగ్గరవుతున్నప్పుడు అవయవాలు సాధకం చేయడం సాధ్యపడదు. నీ చెవి వినబడదు, నీ కన్నులతో చూడలేవు, నీ చేతులతో పనిచేయలేవు.., నీ శరీర అవయవాలు సహకరించినప్పుడే అనగా బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, నీ అవయవాలు సాధకము చేయుము. 


(ప్రసంగి.  12:1-6): "దుర్దినములు రాకముందే– ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,౹ తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.౹ ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు, కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు.౹ తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతమునుచేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు.౹ ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు.౹ వెండి త్రాడు విడి పోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్దకుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును.౹"


 .  గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారు మాత్రమే

(ప్రకటన 21:27): "గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు."


జగత్తు పునాది వేసినప్పుడే పరలోకమందున్న దేవుడు ఒక గ్రంధాన్ని తన సముఖములో మెంటైన్ చేయడం ప్రారంభించాడు. "... జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు..."(ప్రకటన 13:8) ఆనాడే ఆ గ్రంథము గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమని నామకరణం చేయబడింది. ఆ గ్రంథంలో నీతిమంతుల పట్టి ఉంటుంది.(కీర్తనలు. 69:28). దేవుని కృపచేత, క్రీస్తునందు విశ్వాసము ఉంచి, ఆయన రక్తము చేత తమ వస్త్రాలను ఉతుకొనేవారు నీతిమంతులుగా తీర్చబడుదురు (రోమా. 3:24-26). అటువంటి నీతిమంతుల పట్టిక మాత్రమే గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడును. అలాగే సువార్త పనిలో/ అపోస్తలుల బోధను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన చేయువారికి సహకారుల పేరులు వ్రాయబడును(ఫిలిప్పీ. 4:3). మరియు యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారి పేరులు మాత్రమే వ్రాయబడును.(మలాకీ 3:16).


👥 ఎవరి పేరులు ఉండవు?

A. ఎవరైతే దేవుని యెదుట పాపము చేస్తారో వారి పేరులు గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు తుడిచి వేయబడును. (నిర్గమా. 32:32-33).

B. నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వారి పేరులు ఉండవు. (ప్రకటన. 21:27).

C .  తమ వస్త్రాలను అపవిత్ర పరచుకునే వారి పేర్లు ఉండవు. (ప్రకటన. 3:4)

D. మనుషులు యెదుట(సిగ్గు పడి)క్రీస్తుని ఒప్పుకొనని వాడి పేరు ఉండదు. (మత్తయి. 10:32; లూకా. 12:8).

E. క్రీస్తు సంఘములో(చర్చ్ ఆఫ్ క్రైస్ట్) అనగా క్రీస్తు సంఘమను శరీరములో లేనివాడి పేరు ఉండదు. (మత్తయి. 16:18-19; ఏపేసి. 1:23; కొలసి. 1:18).

"ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను." (ప్రకటన. 20:15)


.  పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువారే మాత్రమే

ఇది యేసు యొక్క ఒక హెచ్చరిక. పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి, కేవలం యేసును ప్రభువు ప్రభువు అని పిలవడమే సరిపోదు.  పరలోకమందున్న నా(యేసు) యొక్క తండ్రి(దేవుడు) చిత్తప్రకారము చేయువారు మాత్రమే పరలోకంలో స్థానం పొందగలుగుతారని యేసు చెబుతున్నాడు. 


(మత్తయి 7:21): "–ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును."


💫 యేసు యొక్క తండ్రి చిత్తము ఏంటి?

ప్రభువైన యేసు మాట వినవలసిందే తండ్రి యొక్క చిత్తము (లేదా) ప్రభువు అధికారానికి శిరసా వహించడమే. "మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹" (అపో.కార్య. 3:22-23). "నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక— ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును." (లూకా. 6:46-47). ప్రభువు మాట వినని వారు ఏమాత్రం పరలోకానికి ప్రవేశించలేరు. 


.  శరీరకార్యములు లేనివారు మాత్రమే

(1కొరింధి 6:9-10): "అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర రని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను౹ దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.౹"


(గలతి 5:19-21): "శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,౹ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,౹ భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.౹"


(ఎఫెసి 5:5): "వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.౹"


(ప్రకటన 22:15): "కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు."


 . పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవించి, కలిపి, చెరిపి కార్యక్రమం చేయనివారు మాత్రమే

ప్రకటన గ్రంథం దేవుడు మానవాళికి తెలియజేసిన ఒక ప్రత్యేక సందేశం. ఈ గ్రంథంలోని వాక్యాలను మార్చకూడదని, లేదా ఏదైనా తీసివేయకూడదని తెలిసి కూడా చేస్తే...  వారికి జీవవృక్షం మరియు పరిశుద్ధ పట్టణంలో  ప్రవేశం ఉండదు. 


(ద్వితీయోపదేశకాండము 4:2): "మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.౹"


(ద్వితీయోపదేశకాండము 12:32): "నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు."


(ప్రకటన 22:18-19): "ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా– ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;౹ ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును."


. అన్యాయపు సిరి చేత స్నేహితులను సంపాదించుకొనువారు మాత్రమే 

మనం సంపదను కేవలం సొంత ఆనందం కోసం కాకుండా, దేవుని కోసం మరియు ఇతరుల కోసం ఉపయోగించాలి. సంపదను దానం చేయడం లేదా ఇతరులకు సహాయం చేయడం ద్వారా స్నేహితులను సంపాదించుకోవచ్చు. ఇలా జరిగిస్తే మనం పరలోక నివాసాలలోకి ఆహ్వానించబడతాము. ఇది లోక స్నేహము కాదు సుమీ!. 


(లూకా.  16:9): "అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను."


(ఎఫెసి.  4:27): "అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.౹"


 . సత్‌క్రియలు అను ధనవంతులు మాత్రమే

ప్రస్తుతం ధనవంతులుగా ఉన్నవారు ఈ లోకంలో తమ ధన సంపదల పైన ఆధారపడి ఉండకూడదని, దానికి బదులుగా అస్థిరమైన ధనము నందు దేవునిపై ఆధారపడాలని,. దేవుడు సమృద్ధిగా మనకు అన్నీ ఇస్తాడు, కాబట్టి మనం ఆయనపై ఆధారపడాలి.  మరియు ఇలా ధనవంతులుగా నున్నవారు తమ ధనంతో మంచి పనులు చేయాలి, ఉదారంగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఇటువంటి సత్ క్రియలు వారిని నిజమైన పరలోక ధనవంతులుగా చేస్తుంది. చివరిగా రాబోవు కాలమునకు(పరలోకమునకు) మంచి పునాది తమకొరకు వేసికొనేలా చేస్తుంది.


(మత్తయి. 6:20): "పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి;


(1 తిమోతి.  6:17-18): "ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.౹ వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము."


💥 NOTE  👇

ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకో(మత్తయి. 19:23). ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను (లూకా. 12:15). ధనము కోరుకునే ప్రజలు ప్రలోభాలకు లోనవుతారని, ఒక ప్రమాదకరమైన కోరికనని, ఎందుకంటే ఇది వ్యక్తిని పాపంలోకి మరియు వినాశనంలోకి నెట్టివేస్తుందని, ఆశించే వ్యక్తిని అపవిత్రమైన పనులు చేయమని బలవంతం చేస్తాయని, చివరికి నష్టానికి దారితీస్తుంది. ఇది వ్యక్తి యొక్క జీవనానికి వినాశనాన్ని కలిగిస్తుంది. (1 తిమోతి. 6:9) కావున ఇహలోక ధనవంతులు పరలోకానికి ప్రవేశించలేరు. 


📖 ఓ చదువరి...  పైన పేర్కొన్న వాటిని పక్కనబెట్టి నిజముగా పరలోకమునకు వెళ్ళగలవా? చివరిగా ఆలోచించుకో... నేటి క్రైస్తవ సేవకులు/విశ్వాసులు చేస్తున్న రెండు భయంకరమైన అబద్ధపు బోధ ఏంటంటే... 


.  దేవుని యొక్క హద్దులును దాటి, గ్రంథానికి వ్యతిరేకంగా తమ జీవితాన్ని తమకి నచ్చిన రీతిలో కొనసాగించినప్పటికి తాను మృతినొందిన వెంటనే... తమ విశ్వాసుల నోట నుండి వచ్చే మాట మరియు తమ సమాధి బండలు మీద వ్రాయించుకొనే మాట ... "అంతట– ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు." (ప్రకటన. 14:13) ఇది కాస్త న్యాయమేనా ఆలోచించుకో...


.  మరి కొంతమంది సేవకులు అయితే పరలోకానికి ఎవరు వెళ్లకపోతే ఖాళీగా ఉంటాది కాబట్టి రక్షణ పొందుకునేవారు ఎవరైనా వెళ్ళిపోతారు అని బోధిస్తూ వారి యొక్క ఉదార స్వభావాన్ని జనుల మధ్య చాటుకుంటున్నారు. తీర్పు దినాన ఇటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటాదో తలచుకుంటే జాలి వేస్తాది.


👊 సారాంశం :

నీ వస్త్రాలు గొఱ్ఱెపిల్ల రక్తముతో ఉతుక్కోకుండా, తెలుపు చేసుకోకుండా, తండ్రి చేత ఆశీర్వదింపబడని వ్యక్తిగా ఉంటూ,  జ్ఞానేంద్రియాలమును సాధకం చేసుకొనక, గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంధం నందు నీ పేరు నమోదు చేయబడక, తండ్రి చిత్తాన్ని గుర్తించక/అనుసరించక, శరీర కార్యాలతో జీవిస్తూ, గ్రంధాన్ని వక్రీకరిస్తూ, ఇతరులకు మేలు చేయక, ప్రతి వనరులను సద్వినియోగం చేసుకొని స్నేహితులను సంపాదించుకొనక, ఇహలోక ధనము కలిగినవాడై ఉంటే ఎలా పరలోకమునకు పోవుదువు? నీకు ఇవ్వబడిన సమయంలోనే ఆలోచించుకో మిత్రమా!! 🙏🏿 

మీ ఆత్మీయులు👪

WhatsApp Join Us   Telegram Join Us

Questions and Comments here!

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16