మట్టల ఆదివారము! (Palm Sunday)

మట్టల ఆదివారము! (Palm Sunday)

క్రైస్తవులని పిలువబడుతున్న వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రియులారా, నేటి క్రైస్తవులు చేయుచున్న అనేక వ్యర్థమైన పండుగలను గూర్చి మునుపు వ్రాయబడిన లేఖనానుసారమైన అంశముల ద్వారా తెలుసుకున్నాము. అటువంటి పండుగలలో ఈ మట్టల ఆదివారము కూడా ఒకటి కనుక లేఖనానుసారముగా గ్రంధము ఆధారముగా ఈ పండుగను గూర్చి ఆలోచన చేద్దాము.

వాస్తవానికి పరిశుద్ధ గ్రంధములో “మట్టల ఆదివారము” అనే పదమును కూడా మనము చూడలేము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన పండుగలలో కూడా ఈ మట్టల ఆదివారమనే పండుగ అనేది లేదు.

పర్ణశాల పండుగ చేయునప్పుడు మొదటి దినమున ఈత మట్టలను, మొదలగు కొమ్మలను తెచ్చి యెహోవా సన్నిధిని ఉత్సాహించమని ఆజ్ఞాపించియున్నారు కాని ఆదివారమని లేక విశ్రాంతి దినము మరుసటి రోజని లేక మట్టల పండుగని చేయమని కాని ఆజ్ఞాపించలేదు.


మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను, గొంజి చెట్లకొమ్మలను, కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. – (లేవీ.కాం. 23:40).

NOTE: ధర్మశాస్త్రములో మనము ఎంత వెతికినా మనకు ఈ పండుగను గూర్చిన ఆనవాలు కనిపించదు.


పరిశుద్ధ గ్రంథములోని క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, యోహాను సువార్తలలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనెక్కి వీధులలో ఘనపరచబడినపుడు అక్కడ ప్రజలు కొందరు ఖర్జూరము మట్టలను, మరికొందరు తమ దగ్గరున్న బట్టలను నేల మీద పరిచి ఆయనను ఘనపరచినట్టుగా గ్రంధమందు చూడగలము కాని “మట్టల ఆదివారము” అని ఒక ప్రత్యేకముగా ఈ పండుగను చేసినట్టుగా చూడలేము.

[గమనిక : ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని తన శిష్యులకు ఆజ్ఞాపించని యెడల ఈ విషయముపై గల అవగాహన నిజముగా వారికి లేకుండకపోయెను. వారు ఆయనను ఊరేగించకుండా ఉండి ఉంటే అక్కడ ప్రజలకు కూడా పొలములోనికి వెళ్లి మట్టలు తెచ్చేంత అవసరత వారికి లేకపోవును].

వారు ఆ గాడిదెపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిమీద వేయగా ఆయన దానిని ఎక్కి కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు నడుచుచుండువారును వెనుక వచ్చుచుండువారును - జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాకసర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలువేయుచుండిరి. – (మత్తయి. 21:7-10, మార్కు. 11:7-11, యోహాను. 12:12-15).


ప్రియులారా, పైన తెలుపబడిన లేఖనములలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని శిష్యులకు ఆజ్ఞాపించాడు కాని "మట్టలను" గూర్చి ఆయన ఆజ్ఞాపించలేదు, తన శిష్యులకు కాని అక్కడ ప్రజలకు ప్రజలకు కాని ఆయన తెలియపరచలేదు.


యేసు గాడిదనే ఎందుకు ఎక్కెను ?



జెకర్యా ప్రవక్త ద్వారా ముదుగానే తెలియజేయబడిన ప్రవచనము నెరవేర్చుటకు.

» సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. – (జెకర్యా. 9:9).

ఎందుకనగా ధర్మశాస్త్రమును నేరవేర్చుటకై ఆయన ఈ లోకమునకు వచ్చెనను మాట సత్యము కనుక.

» ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ( వచనముల) నైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. – (మత్తయి. 5:17).


జెకర్యా ప్రవక్త తన ప్రవచనములో గాడిదను మాత్రమే ఎందుకు ఎన్నుకొనెను?



యూదులు సామాన్యముగా విజేతలను గాడిదలపై లేదా కంచర గాడిదలపై  స్వారీ చేయించుట వారి ఆచారము. అయితే రాజులు గుర్రములపై స్వారీ చేయుట మనకు తెలిసిన సంగతి కాని కొన్ని సందర్భాలలో యూదులు గాడిదలను ఎన్నుకొనుటకు గల కారణమేమిటంటే గాడిదను సమాధానమునకు సూచికగా వారు భావించుటయే ఇందుకు కారణము.

» తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. – (న్యాయాధి. 5:10).

» అంతట రాజుమీరు మీ యేలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారు డైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి,.. – (1 రాజులు. 1:33). 

[గమనిక: యేసుక్రీస్తు వారు సకల ప్రజలను తండ్రితో సమాధాన పరచుటకై యెరూషలేమునకు వెళ్లియున్నాడు కనుక ఆయన గాడిదనెక్కి పోవుట జరిగింది]

» యేసుక్రీస్తు వారు నిజముగానే సమాధానకర్తయగు అధిపతి. – (యెషయా. 9:6). 

ఎప్పుడైతే ఆయన గాడిద పిల్లనెక్కి యెరూషలేములో ప్రవేశించాడో అప్పుడే జెకర్యా ప్రవచనము నెరవేరబడింది.

» అంతట ఆయనమోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. (లూకా. 24:44).


అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను ఎందుకు ఉపయోగించారు?


యూదులు పవిత్రంగా భావించే వాటిలో ఈ ఖర్జూరపు చెట్టు ఒకటి. అంతేకాకుండా పర్ణశాలల పండుగను ఆచరించుటలో ఖర్జూరపు మట్టలకు ప్రాధాన్యతనివ్వమని దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టుగా ధర్మశాస్త్రమందు చూడగలము.


» మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను, గొంజి చెట్లకొమ్మలను, కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. – (లేవీ.కాం. 23:40).

» వారు తమ పట్టణము లన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవచెట్ల కొమ్మలను, అడవి ఒలీవచెట్ల కొమ్మలను, గొంజిచెట్ల కొమ్మలను, ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. – (నెహేమ్యా. 8:15).

ప్రియులారా, చాలామంది *యోహాను సువార్త 12:12* వచనములో “పండుగ” అని సంభోధించారు కాబట్టి అది మట్టల ఆదివారమనే భావనలో ఉన్నారు కాని అక్కడ తెలుపబడింది యూదుల యొక్క “పస్కా పండుగ” అని గ్రహించాలి. – (యోహాను. 11:55, 12:1).


నేటి క్రైస్తవుల పని ఏమి?



ఎప్పుడో యేసుక్రీస్తు వారిచే నెరవేరబడిన ప్రవచనమును జ్ఞాపకమును చేసుకుని మట్టలు పట్టుకుని వీధులవెంట తిరిగి పండుగులా ఆచరించుట నేటి క్రైస్తవుల పని కాదు. ఈ మట్టల ఆదివారమనే పండుగ ద్వారా మేము క్రీస్తు సువార్తను లోకములో ప్రకటన చేయుచున్నామని చెప్పుచూ కొందరు తమను తాము సమర్థించుకుంటున్నారు కాని నీవు నిజముగా క్రీస్తును ప్రకటన చేయాలని ఆలోచన కలిగి ఉంటే పండుగ పేరుతో కాదు సమయమందును అసమయమందును సువార్తను చేయాలి.

అంతేకాదు మనకు నచ్చినట్టిగా గ్రంధమును చదివి, లేనివి కల్పించి, లేఖనమును అపార్థము చేసికొనుచూ, అసత్యమును ప్రకటన చేయుట వలన శాపగ్రస్తులమవుతాము కాని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేము.

» వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. – (2 తిమోతి. 4:2).

» వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. – (2 పేతురు. 3:16).

» మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. – (గలతీ. 1:8).

ప్రియ సహోదరుడా, సహోదరీ, గట్టిగా చెప్పాలంటే క్రైస్తవులమైన మనకు అసలు పండుగలే లేవు. మనకున్న ఏకైక పండుగ ప్రతి ఆదివారమును తూ.చ. తప్పకుండా ఆచరించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఆయన బలియాగమును జ్ఞాపకము చేసికొనుచూ, ఆయన సిలువను గూర్చిన సువార్తను లోకమునకు ప్రకటిస్తూ,  ప్రభువు బల్లలో పాలు పంచుకొనుటయయే.


NOTE:- యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనమును మాత్రమే జ్ఞాపకము చేసుకోమని ఆజ్ఞాపించుట గ్రంధమందు చూడగలము.

★ వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. – (మత్తయి. 26:26-27).

★ వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. – (మార్కు. 14:22-23).


కాబట్టి పై వచనముల ఆధారముగా ఇతర పండుగలతో అనగా మనుష్యులు కల్పించిన పండుగలతో (శ్రమదినము, మట్టల ఆదివారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్టమస్,...) మనకు సంబంధము లేదని నిజమైన క్రైస్తవుడు ఖచ్చితముగా గ్రహించగలడు.


» మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. – (గలతీ. 4:10).

» కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. – (కొలస్సి. 2:16).


కావున, ఆలోచన చేసి, నిన్ను నీవు స్వపరీక్ష చేసుకొని సత్య బోధను అనగా అపోస్తులుల బోధని అంగీకరించాలని మీకు మనవి చేయుచున్నాను.

★ ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.  – (సామెతలు. 30:6).


మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"నీవు నిజముగా రక్షింపబడ్డావా?" (Are you saved? Are you sure?)

నీవు నిజముగా రక్షింపబడ్డావా?

పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.  

యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడిన అనేకమంది క్రైస్తవులకు తాము రక్షింపబడ్డామనే నమ్మకము వారికి లేదు. మరికొంతమంది రక్షింపబడ్డాము అని నమ్ముతున్నారు కాని తప్పులు చేస్తున్నారు రక్షణ కోల్పోతున్నారు. కాని ప్రియులారా, క్రైస్తవులమైన మనము ఈ దినమున  లోకములో మన దేహము విడిచిపెట్టినా కూడా  మన ఆత్మ ఖచ్చితంగా రక్షింపబడుతుందనే నమ్మకము ఉండాలి.   

ప్రియులారా, చాలామంది రక్షింపబడినప్పటికీ వారి రక్షణపై పూర్తి స్థాయిలో నమ్మకము లేక దేవుని నుండి తొలగిపోతున్నారు. సొంత ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తూ రక్షణ భాగ్యమును కోల్పోతున్నారు.
దేవుని మాటలను కాకుండా  నీ సొంత ఆలోచనలను బట్టి జీవిస్తే మాత్రము నీ రక్షణను నీవు కాపాడుకోలేవు.

» ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును. (సామెతలు. 16:25).

» ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. (మత్తయి. 7:13-14).

» ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్లగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియలచొప్పున వారికంతము కలుగును.(2 కొరింధి. 11:13-15).

కనుక ప్రియులారా, తండ్రియైన దేవుని కృప చేత ప్రభువైన క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనము దేవుని మాటలను అనుసరించి నడవాల్సిన వారమై ఉన్నాము కాని మన సొంత ఆలోచనలను బట్టి కాదు.
ఈ లోకములో దేవుని కృప వలన సమస్తమును పొందుకుని, అన్నిటిలోనూ విజయము సాధించి, తమ జీవితములో కొంతకాలము మట్టుకు దేవునిపై పూర్తి విశ్వాసముతో కొనసాగి, తరువాత తమ సొంత ఆలోచనలకు ప్రాదాన్యతనిచ్చి నశించిపోయిన వారు ఉన్నారు.

రాజైన సొలోమోను :


» ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి (సొలోమోను) రెండు మారులు ప్రత్యక్షమై. నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. (1 రాజులు. 11:9-11).

రాజైన ఉజ్జియా :


» అతడు (ఉజ్జియా) స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చేయగా యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబది మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించిఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. (2 దినవృత్తా. 26:16-19).

ప్రియ సహోదరుడా, సహోదరీ రక్షణ అనేది దేవుడు మనకు దయచేసిన గొప్ప భాగ్యము. ఆనాడు ఇశ్రాయేలీయులు ఇటువంటి గొప్ప రక్షణను పొందుకుని కూడా దేవునికి విరోధముగా పాపము చేసి అరణ్యములో కూలిపోయారు. మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది?

మనము ఏ ఏ మార్గములలో నడుచుకోవాలో, ఎలాంటి జీవితమును జీవించవచ్చునో మన ఆలోచనలకే మన తండ్రియైన దేవుడు విడిచిపెట్టారు.  కాని ప్రతి విషయమునకు అనగా మంచి చెడులకు సంబంధించిన విషయములపై పూర్తి అవగాహన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియజేయడమైనది. ఏ మార్గమును ఎంచుకుంటావో అది మన వ్యక్తిగతమైన విషయము.


మనముందున్న రెండు మార్గములు  


పరలోకములో నిత్య సంతోషము :


» అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణమము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లకుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు - ఇదికో దేవుని నివాసము మనుష్యలతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు; మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసననములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.  (ప్రకటన. 21:1-4).

పాతాళములో నిత్య వేదన :


» పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండుగుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. (ప్రకటన. 21:8).

ఈ రెండు మార్గములలో ఏ మార్గమును ఎంచుకోవాలో మన ఆలోచనకే విడిచిపెట్టాడు దేవుడు. ఏ మార్గమును ఎంచుకుంటే ఆ మార్గమునకు తగిన ఫలము ఖచ్చితంగా అనుభవిస్తాము అది నిత్య సంతోషమైనా, నిత్య నరకమైనా.

ప్రియులారా, దేవుడు తన పరిశుద్ధ గ్రంధములో చాలా గొప్ప మాటలను మనకు తెలియజేసాడు. దేవుడు పరిశుద్ధ గ్రంధములో వివాహము యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియజేస్తూ స్త్రీ పై పురుషునికి అధికారమిచ్చాడు, స్త్రీ పురుషునికి లోబడాలని తెలియజేసాడు. అంటే భౌతిక సంబంధమైన జీవితముకు సంబంధించి ఏ విషయమైనా పురుషుని ఆలోచనలకే ప్రాధాన్యతనివ్వమని  ఆ మాటలకు అర్థము. అలాగే, క్రీస్తులోనికి బాప్తీస్మము పొంది రక్షణ పొంది, ఆయన సంఘములో చేర్చబడిన  మనము క్రీస్తుతో ప్రధానము చేయబడిన వారము కనుక ఆయన మాటలకు, ఆలోచనలకు ప్రాధాన్యతను ఇవ్వవలసిన వారమై ఉన్నామని ధృడముగా విశ్వసించాలి.
మన రక్షణ విషయములో మనకు నమ్మకముండాలి.  మన సొంత ఆలోచనలకు కాదు దేవుని ఆలోచనలకు అవకాశమివ్వాలి.  

● ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.  (రోమా. 6:22-23).

● మీరు విశ్వసించినవారై కృపచేత రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడవీలులేదుమరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ క్రియలు చేయుటకై మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియై యున్నాము.(ఎఫెసీ. 2:8-10).

నీవు నిజముగా రక్షింపబడ్డావని నమ్మితే ఖచ్చితముగా క్రీస్తు ప్రత్యక్షతలో నిత్య జీవమును పొందుకుంటావు.
నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆలోచన చేయు ! ప్రవర్తన సరిదిద్దుకో ! 

మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  

"పస్కా పండుగ" (The Passover)

పస్కా పండుగ

క్రైస్తవులని పిలువబడుతున్న వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి కాలములో అనేకమంది క్రైస్తవులు పరిశుద్ధ గ్రంధములో లేని అనేక పండుగలను ఆచరిస్తున్నారు. వారు ఆచరిస్తున్న పండుగలలో పస్కా పండుగ ఒకటి. ఈ పస్కా పండుగను చాలా మంది “ క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుటకై చేస్తున్నామని “ చెప్తున్నారు. చాలామందికి లేఖనాలపై సరియైన అవగాహన లేక ఈ పండుగను చేస్తున్నారు, మరి కొంతమంది అందరు చేస్తున్నారు కనుక మేము చేయాలి అనే భావనతో చేస్తున్నారు, ఇంకొంతమంది క్రీస్తు మరణమును తలంచుకోవటానికి చేస్తున్నారు.

వాస్తవానికి పరిశుద్ధ గ్రంధములో “ఈ పండుగను ఎవరు చేసారు? ఎప్పుడు చేసారు? ఎందుకు చేసారు? ఈ పండుగ ఉద్దేశ్యము ఏమిటి? ఈ పండుగను చేయమని ఆనాడు వారికి దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? నేటి క్రైస్తవులమైన మనము చేయవచ్చా? పస్కాను చేయమని నేటి క్రైస్తవులమైన మనకు దేవుడు ఆజ్ఞాపించాడా?”. ఇలాంటి కొన్ని విశేషమైన సంగతులను లేఖనానుసారముగా ఆలోచన చేద్దాము. తప్పును సరిదిద్దుకుందాము.

ఎవరు చేసారు?


ఈ పండుగను ఇశ్రాయేలీయులు (లేదా) యోకోబు సంతానమైన పన్నెండు గోత్రముల వారు మాత్రమే చేసినట్టుగా పరిశుద్ధ గ్రంధములో చూడగలము.

 » మోషే ఇశ్రాయేలీయుల ”  పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెనుమీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి. (నిర్గమ. 12:21).

 » “ ఇశ్రాయేలీయులు ” పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.(సంఖ్యా.కాం. 9:2).

 » “ ఇశ్రాయేలీయులు ” గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి. (యెహోషువా. 5:10).

ఎప్పుడు చేసారు?


 » ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను.(ద్వితియో. 16:1).

 » మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ ముతోఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. (నిర్గమా. 12:1-3).

 » దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.(సంఖ్యా.కాం. 9:3, యెహోషువా. 5:10).

 » మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. (లేవీ.కాం. 23:5).

ఎందుకు చేసారు?


 » యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను. మరియు మీకుమారులుమీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కా రముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. (నిర్గమ. 12:25-28).

 » ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱ మేకలలో గాని గోవులలోగాని బలి అర్పింపవలెను. – (ద్వితియో. 16:1-2).


పస్కా పండుగ ఉద్దేశ్యము ఏమిటి? మరియు దేవుడు వారిని ఎందుకు పస్కాను చేయమన్నాడు?


దేవుడైన యెహోవా, ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్న తన ప్రజలను ఫరో అధికారము నుండి తప్పించి, అన్యుల ఎదుట అనేక ఆశ్చర్య కార్యములను జరిగించి, వారిని కనాను దేశమునకు రప్పించే మార్గములో ఎన్నో అద్భుత కార్యములను చేసి, వారిని సంరక్షించిన విధానమును ఇశ్రాయేలీయులు తెలుసుకొని, ఆ మహా గొప్ప అద్భుత కార్యములను జ్ఞాపకము చేసుకొని, దేవుడైన యెహోవాను ఘనపరచాలని ఉద్దేశ్యంతో ఈ పస్కా పండుగను ఆచరించమని వారికి ఆజ్ఞాపించినట్టుగా పరిశుద్ధ గ్రంధములో చూడగలము.

 » మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు. మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. – (నిర్గమ. 12:26-27).

 » నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించినకొలది దాని నియ్యవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగు ప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకము చేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. (ద్వితియో. 16:10-12).

 » మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహుబలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసినదేదియు తినవద్దు. ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయు లకు నివాస స్థానమైయుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. (నిర్గమ. 13:3-5).

ప్రియ సహోదరీ, సహోదరుడా, పైన తెలుపబడిన లేఖనములను పరిశీలన చేస్తే పస్కా పండుగ ముఖ్య ఉద్దేశ్యము, ఎవరు చేసారు, ఎందుకు చేసారు, ఎప్పుడు చేసారు, అనే ప్రశ్నలకు చాలా తేటగా సమాధానము తెలిసినది.
దేవుడైన యెహోవా చెప్పిన రీతిగానే ఇశ్రాయేలీయులు పస్కా పండుగను జరుపుకున్నారు, యెహోవా చెప్పిన రీతిగానే చాలా పరిశుద్ధంగా ఆచరించారు.

నేటి క్రైస్తవులు పస్కా పండుగను ఆచరించవచ్చా ?  


వాస్తవానికి ఈ పండుగను చేయడానికి నేటి క్రైస్తవులకు ఆజ్ఞ ఇవ్వబడలేదు. అయినప్పటికీ లేఖనాలపై పూర్తి స్థాయి అవగాహన లేక ఈ పండుగను చేయాలనే భావనలో ఉన్నారు. కాని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది..,

 » మీరు దినములను మాసములను ఉత్సవకాలములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. – (గలతీ. 4:10-12).

 » అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. (కొలస్సి. 2:16).

ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన సిలువ మరణానికి ముందు శిష్యులతో కలిసి పస్కాను భుజిస్తూ, ప్రభువు బల్లను కూడా పరిచయము చేయుట  మత్తయి 26, మార్కు 14, లూకా 22 వ అధ్యాయాలలో చూడగలము. ఆ విషయమును అపోస్తలుడైన పౌలు గారు కొరింధిలో ఉన్న క్రీస్తు సంఘపు వారిని హెచ్చరిస్తూ (1 కొరింధి 11 వ అధ్యాయము) మన ప్రభువైన యేసు  తిరుగు వచ్చు పర్యంతరము దీనిని (ప్రభువుబల్ల) చేయుడని చెప్పెను. కాని ఎప్పుడు ? సంవత్సరమునకు ఒక్కసారా?

★ “ఆదివారమున” మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను. (అపొ.కార్య. 20:7).

ఆదివారము సంవత్సరానికి ఒక్కసారి వస్తుందా? ఆలోచన చేయండి. సంవత్సరమునకు ఒక్కసారే చేయుడి అని ధర్మశాస్త్ర కాలములో వారికి ఆజ్ఞ ఇవ్వబడింది అది కూడా విశ్రాంతి దినము మరుసటి రోజు. మరి నేటి క్రైస్తవులలో శుక్రవారము చేయడము ఆశ్చర్యంగా ఉంది.

1 కొరింధి 5వ అధ్యాయము 7, 8 వచనములు :


★ మీరు పులిపిండి లేనివారు గనుక కొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియనిరొట్టెతో పండుగ ఆచరింతము. – (1 కొరింధి 5:7-8).

ఈ వచనమును ఆధారముగా తీసుకుని చాలామంది పస్కా చేయవచ్చు అని అనుకుంటున్నారు.
అపోస్తలుడైన పౌలు గారు కొరింధ లో ఉన్న సంఘము యొక్క పరిస్థితిని చూసి, మీలో అనేకమంది జారత్వములు కలిగి ఉన్నారు (1 కొరింధి. 5:1), దేవుని విరోధముగా నడుచుకుంటున్నారు, అని వారిని హెచ్చరిస్తూ జారత్వములు చేసేవారిని పాపములు చేసేవారిని పులిసిన పిండితో పోలుస్తూ , క్రైస్తవులమైన మనకు ఇది తగదు. మనము ఈ లోకము నుండి వేరు చేయబడియున్నాము, మన పాపముల నిమిత్తము క్రీస్తు వధింపబడ్డాడు కనుక  మనము పులిపిండి లేని వారముగా ఉండి, నిష్కాపట్యముతోను, సత్యముతోను” పులియని రొట్టెతో పండుగ ఆచరింతము  అని చెప్పి అక్కడి సహోదరులను బలపరచడం జరిగింది.

ప్రియులారా నేటి క్రైస్తవులమైన మనకు భౌతిక సంబంధమైన పండుగలు ఆచరణలో లేవు.  క్రీస్తు లోనికి బాప్తీస్మము పొందిన మనము ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొని, ఆ ప్రభువు బల్లలో పాలు పొందుట అనేది మనకివ్వబడిన ఆజ్ఞ. అది నెలకొకసారి, సంవత్సరానికొకసారి చేసేది కాదు ప్రతి ఆదివారము చేసేది కనుక క్రైస్తవులమైన మనకు ప్రతి ఆదివారము ఒక పండుగ దినమే కాని అది “భౌతిక సంబంధమైన పండుగ కాదు ఆత్మ సంబంధమైన పండుగ”.  

ధర్మశాస్త్ర కాలములో మన పితరులు చేసినది భౌతిక సంబంధమైనది కాని ఆత్మ సంబంధమైనది కాదు. ఆనాడు మన పితరులు ఆచరించిన ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక (హెబ్రీ. 7:18) వారు పండుగలను, ఆచరించినను, పస్కాను భుజించినను అరణ్యములో కూలిపోయిరి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆ ఆజ్ఞలను పూర్తి స్థాయిలో పాటించక వారందరును నశించిరి.

మరి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ధర్మశాస్త్రములో గల పండుగలను చేయమనా?
ఆయన కుమారుడైన క్రీస్తు మరణమును లోకములో ప్రచురము చేసి నీ ప్రవర్తన ద్వారా అనేకులను సంఘమునకు నడిపించి, ప్రతి ఆదివారము సంఘముగా కూడి పవిత్రంగా, పరిశుద్ధంగా తండ్రిని ఆరాధించి, ప్రతి ఆదివారము ఆయన కుమారుడైన క్రీస్తుని జ్ఞాపకము చేసుకొనుచూ అనగా ప్రభువు బల్లలో పాలు పొందుచూ, అపోస్తులుల బోధలో నిలకడగా ఉండి,  మరణము వరకు నమ్మకముగా ఉండడమే కదా తండ్రి మనకిచ్చిన ఆజ్ఞ. ఆలోచన చేయు. ప్రవర్తన సరిదిద్దుకో. క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె ఈ యుగ సంబంధమైన దేవతతో పోరాడు.....

● ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా, ధర్మశాస్త్రగ్రంధమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే.(గలతీ. 3:10-11).

● ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవునియెదుట శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్నవాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. (రోమా. 3:19-20).


మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  

"గుడారాల పండగ" (The Feast Of Tabernacles)

గుడారాల పండగ  (The Feast Of Tabernacles)

నా తోటి సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. 

గుడారాల పండుగనే "పర్ణశాలల పండుగ" అని కూడా అంటారు. నేటి క్రైస్తవ్యంలో అనేకమంది ఏటేటా గుడారాల పండగను ఆచరించుట మనము చూస్తున్నాము. పరిశుద్ధ గ్రంధములో పాత నిబంధనలో ఈ పండగను గూర్చి  చాలా చక్కటి వివరణతో “ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎవరు చేయాలి?” అనే విషయాలను తెలియజేయుడం జరిగింది. వాటిని గూర్చి క్లుప్తంగా ఆలోచన చేద్దాము.

ఎందుకు చేయాలి..? 


ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్న తన ప్రజలను బానిసత్వము నుండి విడిపించి, కనాను దేశమునకు పోవు మార్గమంతటిలో  వారిని రక్షించి, వారు పగలు రాత్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా  నివాసము చేయుటకు దేవుడు ఏర్పరచిన మార్గము ఈ పర్ణశాలలు. ఆ ప్రజలు దేవుడు చేసిన ఈ గొప్ప మేలును ఎన్నటికీ గుర్తుచేసుకోవాలని దేవుడు ఆశించి ఈ పండుగను చేయాలని  వారికి ఆజ్ఞాపించెను. 

» నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీ యులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను. – (లేవీ.కాం. 23:42).

ఎప్పుడు చేయాలి..? 


» నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. – (లేవి.కాం. 23:34).
యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను. – (నెహేమ్యా. 8:14).  

» కాబట్టి ఇశ్రాయేలీయులందరును ఏతనీమను (రోమా నెలల ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్) ఏడవ మాసమందు పండుగకాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి. – (1 రాజులు. 8:2).

» యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు. - (జెకర్యా, 14:16).

» ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. – (సంఖ్యా.కాం. 29:12).

» నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను. – (ద్వితియో. 16:13).


ఎలా చేయాలి..? 


» మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మ లను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. – (లేవీ.కాం. 23:40).

» వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవచెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. – (నెహేమ్య. 8:15).

» గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి, ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి. – (ఎజ్రా. 3:4).

(గమనిక: సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12వ వచనము నుండి 40వ వచనము వరకు చదువవలెను)


ఎవరు చేయాలి..? 


ఈ గుడారాల పండగ ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడిందని ఖచ్చితమైన ఆధారములు చాలా ఉన్నవి.

» యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను - నీవు “ఇశ్రాయేలీయులతో” ఇట్లనుము,... – (లేవీ.కాం. 23:1-2).

» యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు “ఇశ్రాయేలీయులు” పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను. – (నెహేమ్యా. 8:14).  

ప్రియులారా, దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంధములో  గుడారాల పండగ మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ. దేవుడు మోషే న్యాయకత్వములో ఇశ్రాయేలీయులకు చేసిన మేలులు, అద్భుతములును కనులారా చూడని  వారి తర్వాత తరముల వారు తెలుసికొనుటకై, మరియు యెహోవాయే తప్ప వేరొక దేవుడు లేడని ఆయనే సమస్తమునకు జీవాధారుడని అన్యజనులకు తెలియజేయుటకై ఈ పండగను ఆచరింపమని వారికి ఆజ్ఞాపించెను.


నేటి క్రైస్తవులు ఈ పండగను ఆచరించవచ్చా..? 


నేటి క్రైస్తవులమైన మనము ఈ పండగను ఆచరించవచ్చా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానమే దేవుడు తెలియజేసారు. కాని నేటి క్రైస్తవులు ఆ విషయమును పూర్తిస్థాయిలో అంగీకరించలేకపోతున్నారు. నేటి క్రైస్తవులమైన మనకు జీవాధారుడు యేసుక్రీస్తు. 
తండ్రియైన దేవుడు ఏ బోధనైతే బోధించమని చెప్పాడో అదే బోధను యేసుక్రీస్తు వారు ఈ లోకములో ప్రకటన చేసారు (యోహాను. 8:26,38) కాని సొంత బోధను చేయలేదు. యేసుక్రీస్తు ఏ బోధనైతే బోధించమని అపోస్తులలకి చెప్పారో అదే బోధను అపోస్తులులు ఈ లోకములో ప్రకటన చేసారు (యోహాను. 17:6,14,17,20) కాని సొంత బోధను చేయలేదు. అలాగే అపోస్తులులు ఏ బోధనైతే బోధించారో మనము అదే బోధను ప్రకటన చేయాలి (1 కొరింధి. 2:7, 2 దేస్సలోనిక. 2:15) కాని సొంత బోధను కాదు. 

  నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. – (మత్తయి. 28:28).

పాత నిబంధనలో అనగా ధర్మశాస్త్రములో గల పండగలను గూర్చి అపోస్తులులకు క్రీస్తు ఎలాంటి సంగతులను ఆజ్ఞాపించలేదు. ఆజ్ఞాపించినచో వారు ఖచ్చితముగా చేసి ఉండేవారు, ఆనాటి ఆదిమ క్రైస్తవులకు తెలియజెప్పేవారు. కాబట్టి మనము ఈ పండగల విషయములో సొంత నిర్ణయాలు తీసుకుని అపోస్తులుల బోధకు వ్యతిరేకముగా నడుచుకోకూడదు. ఎందుకనగా,..

 ★ మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. – (గలతీ. 1:8).


 క్రైస్తవులు పండగ పేరు చెప్పి దినములను ఆచరించేవారిగా ఉండకూడదు.

 » మీరు దినములను మాసములను ఉత్సవకాలములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. – (గలతీ. 4:10-11)

» కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. – (కొలస్సి. 2:16).
The churches of Christ greet you - Roma 16:16