Showing posts with label వెయ్యేండ్లు పరిపాలన. Show all posts
Showing posts with label వెయ్యేండ్లు పరిపాలన. Show all posts

"వెయ్యి సంవత్సరముల పరిపాలన" (1000 Years Ruling)

అంశము: "వెయ్యి సంవత్సరముల పరిపాలన"

నా తోటి పరిశుద్ధులకు, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

(ప్రకటన గ్రంథం 20: 4-6)
అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని, క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.


నా ప్రియులారా, క్రైస్తవ్యములో "వెయ్యి సంవత్సరముల పరిపాలన" గూర్చి అనేకమైన బోధలు, తలంపులు, కథలు ఉన్నాయి.

* క్రీస్తు రెండో రాకడలో ఆకాశములో ప్రత్యక్షమై సంఘమును తీసుకొని వెళ్తారని,
* అటు తరువాత, క్రీస్తు మధ్య ఆకాశములో సంఘముతో పాటు ఏడు సంవత్సరములు పెండ్లి విందులో ఉంటారని,
* భూమి మీద ఉన్నవారికి(సంఘములో లేని వారు) భయంకరమైన శ్రమలు వస్తాయని,
* పెండ్లి విందు, భూమి మీద శ్రమల కాలమైన తరువాత క్రీస్తు మరల సంఘమును పట్టుకొని భూమి మీదకు వస్తారని,
* అటు తరువాత, యెరూషలేమును కేంద్రముగా పెట్టుకొని, పరలోక  వాతావరణమును ఈ లోకములోనికి దించి క్రీస్తు తన రాజ్యమును "వెయ్యి సంవత్సరముల పరిపాలన" చేస్తారని.

ఇలాంటి కట్టుకధలు అనేకమంది బోధకులలో వింటూ ఉంటాము.


పరిశుద్ధ గ్రంథము వెయ్యి సంవత్సరముల పరిపాలన గూర్చి ఏమి మాట్లాడుతుందో ఆలోచన చేద్దాము

"ప్రకటన 20:4-6 ఏమి బోధించటము లేదు"


1). వెయ్యి సంవత్సరములు క్రీస్తు భూమి మీద ఎలుబడి చేస్తారని చెప్పటం లేదు. ఎలుబడి చేయు చోటు కూడా ప్రస్తావించలేదు.
2). క్రీస్తు పరిపాలన గూర్చి మాట్లాడటము లేదు.
3). యెరూషలేము కేంద్రముగా చేసుకొని క్రీస్తు ఎలుబడి చేస్తారని చెప్పడము లేదు.
4). హత సాక్షులు పరిశుద్ధమైన ఏలుబడి భూసబంధమైనదని చెప్పటము లేదు.
5). క్రీస్తు సింహాసనాన్ని గూర్చి ప్రస్తావించలేదు.


"ప్రకటన 20:4-6 ఏమి బోధిస్తుంది".


1). క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయని వారు.
2). తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారు.
3). దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారు.
4). మొదటి పునరుత్థాన ములో పాలుగల వారు.
5). రెండవ మరణమునకు లోనుకాని వారు.
6). దేవునికి + క్రీస్తునకు యాజకులైనవారు.

Note:- "వీరు" క్రీస్తుతో కూడా "వెయ్యి సంవత్సరముల రాజ్యము" చేయుదురు.

* అంతేకాని, క్రీస్తు వెయ్యి సంవత్సరముల రాజ్యము చేస్తాడని ప్రకటన. 20:4-6 చెప్పడము లేదు.


బైబిలులో "వెయ్యి" అనే పదము


◆ "నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను". - (నిర్గమ. 20:6; ద్వితీ. 5:10).
◆ "అడవి మృగములన్నియు వేయి కొండల మీది పశువులన్నియు నావేగదా" - (కీర్తనలు. 50:10).
◆ ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. - (2 పేతురు. 3:8; కీర్తనలు. 40:4).

"వెయ్యి సంవత్సరములు అనేది అక్షరార్ధం కాదు".


"యేసు భూమి మీద ఏలుబడి చేయరు"


● యేసు శరీరధారియై ఈ భూమి మీదకు రాకమునుపే అనగా 600 సంవత్సరములు ముందే ప్రవక్తయైన యిర్మీయా క్రీస్తు రాకడలో యెరూషలేమును కేంద్రముగా చేసుకొని పరిపాలన చేస్తాడు అని తెలియజేసారు.
● తండ్రియైన దేవుడు "యెకోన్యాను శపించుట" - (యిర్మీయా. 22:21-29).
● యెకోన్యా సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు. - (యిర్మీయా. 22:30).
● యెకోన్యా సంతానములో ఎవడును యెరూషలేములో సింహాసనము మీద కూర్చుండుటకు అవకాశము లేదు.
● మన ప్రభువైన యేసు వారు యెకోన్యా సంతతి వారు. - (మత్తయి. 1:11).
● మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములో సింహాసనము మీద కూర్చుంటాడు అనేది అర్ధరహితమైన మాట.
● యెకోన్యా రాజవంశములో ఉన్నవాడు కానీ ఆయన సంతతి వారు ఎవరు కూడా యెరూషలేము మీద రాజుగా ఉండడు.

​దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము. - (యిర్మియా 22: 29)

● క్రీస్తు రాకడలో ఆయన భూమి మీదకు వచ్చి, యెరూషలేమును కేంద్రముగా చేసుకొని పరిపాలన చేస్తాడు అనేది ప్రవచనము అసాధ్యము.


 యేసు ఇహసంబంధమైన రాజ్యాన్ని పరిపాలన చేస్తారా..?


A). యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. - ( యోహాను. 18: 36).
B). "రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని" యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను. (యోహాను. 6:15).


క్రీస్తు రెండో రాకడలో ఇహలోకమందు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అనేది అర్ధరహితమైన మాట అని గ్రహించాలి.


 క్రీస్తు రెండో రాకడలో కొనిపోబడిన మనము మరల భూమి మీదకి వస్తామా..?

1థెస్సలొనికయులకు 4: 15-17

● మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

● ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

● ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము.
కాగా మనము "సదాకాలము ప్రభువుతో" కూడ ఉందుము.

సదాకాలము అనగా శాశ్వతముగా లేదా ఎల్లప్పుడూ అని అర్ధము.

* సదాకాలము అంటే వెయ్యి సంవత్సరములు అని అర్ధము కాదు.
* ఆకాశమండలమునకు  కొనిపోబడిన మనము మరల భూమి మీదకు రాము.
* రెండో రాకడలో క్రీస్తు వారు భూమి మీదకు వచ్చి రాజ్యము చేసే కార్యక్రమము ఉండదు.


 క్రీస్తు నేడు రాజ్యపరిపాలన చేస్తున్నారా..?


అవును.... యేసు మరణించి, సమాధి చేయబడి, మూడో దినము తిరిగి లేచిన పిమ్మట (1 కొరింది. 15:3-4) తన వారుకి కనబడి నలబై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4).
● అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమాయెను. అనగా దేవుడు సముఖమునకు తేబడెను. ఇదే దానియేలునకు కలిగిన దర్శనము (అపొ.కార్య. 1:8-9; దానియేలు. 7:13-14).

మనుష్యకుమారునిపోలిన - "యేసుక్రీస్తు" మహావృద్ధు డగువాని - "యెహోవా"

● తండ్రియైన దేవుడు తన కుమారుడిని అభిషేకము చేయుట.

♀మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. (అపొ.కార్య. 2:36).

● తండ్రి చేత పట్టాభిషేకం పొందిన పిమ్మటనే క్రీస్తు తన రాజ్యమును అను క్రీస్తు సంఘమును పరిపాలన చేస్తున్నాడు.

● తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. (కీర్తన. 2:6; 110:1-2; అపొ.కార్య. 2:33-35; 1కోరింథీ. 15:25).

● మనము ఎప్పుడైతే యేసును ప్రభువని నోటితో ఒప్పుకొన్నామో, (రోమా. 10:9). బాప్తీస్మము పొందామో (మత్తయి. 28:19; అపొ.కార్య. 2:38) అప్పుడే అయన తన ప్రజల హృదయములో ఏలుబడి చేయుచున్నారు అని గ్రహించాలి.

● నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి క్రీస్తు సంఘమును అనగా తన రాజ్యమును పరిపాలన చేస్తున్నారు.


క్రీస్తు తన రాజ్య పరిపాలను ఎప్పుడు వరకు చేస్తారు..? 


● ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును. - (లూకా. 1:33).

యుగయుగములు ఏలుబడి (లుకా.1:30-33). అనగా సూర్యుడున్నంతకాలము, చంద్రుడున్నంతకాలము రాజ్యపరిపాలన చేస్తారు.

● అతని సింహాసనము "సూర్యుడున్నంతకాలము" నా సన్నిధిని ఉండుననియు
● "చంద్రుడున్నంతకాలము" అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు. (కీర్తన. 88:35-36).

● "సూర్యుడున్నంతకాలము, చంద్రుడున్నంతకాలము" అనగా  పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవు సమయము వరకు, ఆకాశములు రవులుకొని లయమైపోవు వరకు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు వరకు, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవు వరకు,  క్రీస్తు తన రాజ్యమును పరిపాలన చేస్తారు. (2 పేతురు. 3:10-11).

● ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; "అప్పుడు అంతము వచ్చును". - ( 1కోరింథీ. 15: 24).

హెచ్చరిక


1). మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రెండో రాకడ లో యెరూషలేమును కేంద్రముగా చేసుకొని వెయ్యి సంవత్సరముల పరిపాలన చేస్తాడు అనేది ఒక కల మరియు అది అబద్ధము.
2). క్రీస్తు సంఘముగా (church of Christ) ఉన్నవారు మాత్రమే ఆయన ఏలుబడిలో లేదా అధికారములో ఉన్నవారు అనే విశేషమైన సంగతిని తెలుసుకో! (ఎపేసి. 1:23; కొలొస్స. 1:13; 18; రోమా. 16:16).
3). ప్రతీ ఒక్కరి ఆలోచనలు, పనులు, హృదయము ఆయన అధికారము క్రింద ఉండాలి. (మత్తయి. 7:21; 1 కొరింథీ. 10:5; 1 పేతురు. 3:15).
4). క్రీస్తు వెయ్యి సంవత్సరముల రాజ్యము చేస్తాడని (ప్రకటన. 20:4-6) చెప్పడము లేదు.

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ (KM).©
The churches of Christ greet you - Roma 16:16