Showing posts with label వాయిద్యములు. Show all posts
Showing posts with label వాయిద్యములు. Show all posts

"క్రైస్తవుడు ఆరాధనలో వాయిద్యములు ఎందుకు వాడకూడదు?" (Why should a Christian not use instruments in worship?)

క్రైస్తవుడు ఆరాధనలో వాయిద్యములు ఎందుకు వాడకూడదు?


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

క్రైస్తవులు ఆరాధనలో వాయిద్యములు ఉపయోగించకూడదని లేఖనములను ఆధారము చేసుకొని, దేవుడు ఎటువంటి ఆరాధనను కోరుకుంటున్నాడో, నేటి క్రైస్తవులమైన మనము సత్య ఆరాధనలో వాయిద్యములు వాడవలసిన అవసరము లేదని వివిధ అంశముల ద్వారా తెలియజేసినప్పటికీ, కొంతమంది క్రైస్తవులు సత్య వాక్యమును సరియైన విధములో పరిశీలించకుండా, సరిగా విభజన చేయుకుండా, పరిశుద్ధ గ్రంథమును అపార్థము చేసుకుంటూ గ్రంథమును వ్రాయించిన పరిశుద్ధాత్మునే ప్రశ్నించే వారిగా ఉన్నారు.

ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంధమందున్న ఏ ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి. (2 పేతురు. 1:21). కాబట్టి క్రైస్తవుడవైన నీవు ఈ విషయమును చాలా ఖండితంగా నమ్మితీరాలి కానీ మన సొంత మాటలను చేరుస్తూ, గ్రంథములో  లేని విషయమును గూర్చి ఆలోచిస్తూ పరిశుద్ధాత్ముని ప్రశ్నించే వారిగా మనము ఉండకూడదు.

మొదటి ఆధారము :


● చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. – (ఆది. 6:14).

నోవాహుతో మన దేవుడు “చితిసారకపు మ్రానుతో” మాత్రమే ఓడను చేయమని ఆజ్ఞాపించారు. దీనికి అర్థము వేరొక మ్రానును ఉపయోగించకూడదని తెలుస్తుంది.

నోవాహు కూడా దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను బట్టి చితిసారకపు మ్రానుతోనే ఓడను నిర్మించెను కాని ఇంకొక మ్రాను ఎందుకు ఉపయోగించకూడదని అజ్ఞానముగా దేవుని ప్రశ్నించలేదు.

● దేవుడు అతని (నోవాహు) కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. – (ఆది. 6:22).

రెండవ ఆధారము :


● నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. – (నిర్గమా. 28:1).

ఈ వచనములో దేవుడు తనకు యాజకత్వము చేయుటకు ఆహారోను సంతతి వారు మాత్రమే అర్హులని మోషేకు సెలవిచ్చినప్పుడు  మోషే కాని మిగతా ఇశ్రాయేలీయులు కాని ఆహారోను సంతతి వారు మాత్రమే ఎందుకు యాజకత్వము చేయాలని అజ్ఞానముగా దేవుని ప్రశ్నించలేదు.

మూడవ ఆధారము :


● నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఒక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి, ఇది మీకొరకైన నా శరీరము - నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. – (1 కొరింధి. 11:23-25).

ఈ వచనములో క్రీస్తు వారు తన శరీరమునకు చిహ్నముగా రొట్టెను, తన రక్తానికి చిహ్నముగా ద్రాక్షారసమును తీసుకుని ఆయనను జ్ఞాపకము చేసుకోమని మనకు తెలియజేసారు అయితే రొట్టెగా బదులుగా మాంసమును, రక్తమునకు బదులుగా మరొక పానీయమును ఎందుకు తీసుకోకూడదని నీవు అజ్ఞానముగా ప్రశ్నించకూడదు.

నాల్గవ ఆధారము :


★ యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనెను. – (యోహాను. 4:23-24).

క్రొత్త నిబంధనలో పాడుట గూర్చి మాత్రమే చూడగలము కాని వాయిద్యములు లేవనుటకు క్రింది వచనములే మనకు సాక్ష్యమిస్తున్నాయి.

★ అంతట వారు కీర్తన "పాడి" ఒలీవల కొండకు వెళ్లిరి. – (మత్తయి. 26:30).

★ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు "పాడుచు"నుండిరి. -  (అపొ.కార్య. 16:25).

★ అన్యజనులలో నేను నిన్ను "స్తుతింతును"; నీ "నామసంకీర్తనము" చేయుదును. – (రోమా. 15:9).

★ ఆత్మతో "పాడుదును", మనస్సుతోను "పాడుదును". – (1 కొరి౦ధి. 14:15).

మీ హృదయములలో ప్రభువునుగూర్చి "పాడుచు" కీర్తించుచు. – (ఎఫెసీ. 5:19).

★ మీ హృదయములలో దేవునిగూర్చి "గానము" చేయుచు. - (కొలస్సి. 3:16).

★ సమాజముమధ్య నీ కీర్తిని "గానము" చేతును అనెను. – (హెబ్రీ. 2:12).

★ ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు "పాడవలెను". – (యాకోబు. 5:13).

క్రొత్త నిబంధనలో సంగీతము గూర్చి మాట్లాడుతూ “పాడుట” లేదా “పాడిరి” అని మాత్రమే  ఈ వచనములన్నియు తెలియజేస్తున్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఆజ్ఞగా మనము చూడగలము. అపోస్తులులు కూడా ఏ సంధర్భములోను వాయిద్యముల ప్రస్తావన తీసుకురాలేదు వాటిని ఉపయోగించమని గ్రంథములో ఎక్కడా కూడా బోధించలేదు. కాబట్టి, ఈ వచనములలో పాడుట గూర్చి మాత్రమే ఉన్నది వాయిద్యములు వాడకూడదని చెప్పలేదు కదా అని క్రైస్తవుడవైన నీవు అటువంటి ఆలోచనా విధముతో మాట్లాడుతూ లేని విషయమును కలిపితే పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడినట్టే.

ఇలా చూసుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథమందు చాలా ఆధారములు ఉన్నవి అయితే ఇన్ని ఆధారములున్నప్పటికి, సొంత ఆలోచనలతో దేవుని ప్రత్యేకమైన ఆజ్ఞను మీరితే వాటి యొక్క ఫలితము కూడా గ్రంథమందు వ్రాయబడింది.

A) ఆహారోను కుమారులకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞను మీరినందుకు వారికి కలిగిన ఫలితము :

● అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. – (లేవీ. 10:1-2).

B) దేవుడు బండతో మాట్లాడమంటే మోషే బండను కఱ్ఱతో కొట్టగా అతనికి కలిగిన ఫలితము :

● నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. – (సంఖ్యా. 20:8).

● అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను. – (సంఖ్యా. 20:11).

● ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. – (సంఖ్యా. 20:24).

C) దేవుడు ఆజ్ఞాపించని యాజకత్వపు పనిని రాజైన ఉజ్జియా చేయగా అతనికి కలిగిన ఫలితము :

● వారు రాజైన ఉజ్జియాను ఎదిరించిఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా" "ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. – (2 దినవృత్తా. 26:18-19).

D) పరిశుద్ధ గ్రంథములో వేటిని కలిపినా తీసివేసినా అతనికి కలుగు ఫలితము :

● ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు - అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. – (ప్రకటన. 22:18-20).

కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చి, దానిని ప్రత్యేకపరిచినప్పుడు ఆ ఆజ్ఞకు వ్యతిరేకముగా ఏమియు మాట్లాడకూడదు, వేరొక ఆలోచన చేయకూడదు.  దీనిని బట్టి “క్రైస్తవులు సత్య ఆరాధనలో సంగీత వాయిద్యములు ఎందుకు వాడకూడదో, ఏ విధముగా తండ్రియైన దేవుని ఆరాధించాలో  చెప్పబడిన ఆజ్ఞ”కు వ్యతిరేకముగా ఆలోచన చేసి పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడకూడదని (మత్తయి. 12:32)నన్ను నేను హెచ్చరిక చేసికొనుచూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"పరలోకములో వాయిద్యములు?" (Instruments in Heaven?)

పరలోకములో వాయిద్యములు?


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి క్రైస్తవులమైన మనము వాయిద్యములు ఉపయోగించవచ్చా? ఈ  విషయమై పరిశుద్ధ గ్రంథమును పరిశీలన చేసి, క్రైస్తవులు వాయిద్యములు ఉపయోగించకూడదని ఇంతకు మునుపు వ్రాయబడిన  “పాత నిబంధనలో వాయిద్యములు”, “క్రొత్త నిబంధనలో వాయిద్యములు” అనే అంశముల ద్వారా తెలుసుకున్నాము. అయితే మనలో కొంతమంది సహోదరులు పై అంశములలో తెలిజేయబడిన వాటిని  అంగీకరించినప్పటికి, ప్రకటన గ్రంథములో తెలుపబడిన వచనములను (ప్రకటన. 5:8, 14:2, 15:2) ఆధారము చేసుకొని పరలోకములో వాయిద్యములున్నవని తలంచి ఆరాధనలో వాయిద్యములు ఉపయోగించవచ్చని అనుకొనుచున్నారు.

★ మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. – (ప్రకటన. 14:2).

★ మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై, ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచియుండుట చూచితిని. – (ప్రకటన. 15:2).

పైన చూపబడిన రెండు వచనములలో “వీణెలు” అనే పదము ఉన్నది కనుక పరలోకములో వాయిద్యములో వాయిస్తున్నారని తప్పుగా అర్థము చేసికొనుచు పై వచనములను వక్రీకరణ చేయుచున్నారు.
పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకములలో ఒకటైన ప్రకటన గ్రంథము అనేకమైన దర్శనములతో నింపబడినది.

1) ఈ గ్రంథమును అపోస్తులుడైన యోహాను గారు రోమా చక్రవర్తి డొమి షియన్ కాలములో క్రీ.శ. 81 – 96 మధ్య  పరిశుద్ధాత్ముని ప్రేరణతో వ్రాయడము జరిగింది.

2) యోహాను గారు ఈ గ్రంథమును ఆత్మవశుడై (“అనగా దేవుని వశములో ఆత్మ మాత్రమే సంచారము చేయుట”) దేవుడు తనకు కనపరిచిన సంగతులను గురుతుల, సంఖ్యల భాషలలో వ్రాయడము జరిగినది.

3) పైన వచనములలో (ప్రకటన. 14:2, 15:2) తనకు చూపబడిన సంగతులను వివరిస్తూ, తాను  పరలోకములో నుండి ఒక శబ్దము రాగా విన్నారని, వినసొంపుగా ఉన్న ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినదని చెప్పుచున్నారు. ఇక్కడ గమనించాల్సినిది ఏమిటంటే యోహాను గారు విన్న వినసొంపైన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదము కాదు ఎందుకనగా ఆయన “పోలినది” అని మాత్రమే అన్నారు కాని విమోచింపబడిన వారు వాయిద్యములను వాయిస్తున్నట్టుగా తెలుపలేదు.

4) కాబట్టి, పరలోకములో భౌతిక సంబంధమైన వీణెలు వాయించుచున్నారని, ఇహలోక సంబంధమైన వాయిద్యములు పరలోకములో కలవని ఆ వచనములు యొక్క అర్థము కాదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు (1 కొరింధి. 15:50) కనుక భౌతికమైన వీణెలు పరలోకములో ఉండుట వీలుపడదు.

5) ప్రియ సహోదరులారా, “దేవుని వీణెలు గలవారై” (ప్రకటన. 15:2) అనగా దేవుని సేవార్థమైన వీణెలు. ప్రకటన 14:2 వ వచనములో విస్తారమైన జలముల  ధ్వనివలె లయబద్ధంగాను మరియు గొప్ప ఉరుము ధ్వనివలె గంభీరంగాను వీణెలు వాయించుచున్న వైణికుల నాదమువలె యోహాను గారు విన్న శబ్దము వివరణ అదేమనగా పరిశుద్ధుల యొక్క మధుర గీతములే.

6) దేవుని సేవార్థమైన వీణెలు హృదయ వీణెలై ఉండాలి. ఎఫెసీ. 5:19, కొలస్సి. 3:16 లో గానము లేదా పాటలు అనే దానికి  గ్రీకు పదము “paasllo”. వీణెలు అనే పదము ప్రకటన గ్రంథములో 2 సార్లు చిహ్నముగా వ్రాయబడినది. దీనికి అర్థము ఈ వీణెలు హృదయ వీణెలే కాని, జంత్ర (వాయిద్యము) వీణెలు కాదు.

★ ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణెలును, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱె పిల్ల యెదుట సాగిలపడిరి. – (ప్రకటన. 5:8).

పై వచనములలో (ప్రకటన. 14:2, 15:2)  తెలుపబడిన ఈ వీణెలు వాయిద్యములు కాదని ఇంత చక్కగా తేటపరచబడినప్పటికి ప్రకటన. 5:8 వ వచనమును బట్టి పరలోకములో వీణెలు కలవని, అక్కడ వాయిస్తున్నారు కదా  నేటి క్రైస్తవులమైన మేము కూడా  ఆరాధనలో వాయిద్యములు  వాయించవచ్చు అని నీవు అనుకుంటే నీవు చేయు ఆరాధనలో “నాలుగు జీవులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును” కూడా ఉపయోగించవలసి ఉన్నదని గమనించగలరు.

కావున ప్రియ సహోదరీ, సహోదరుడా వాక్యాన్ని వక్రీకరణ చేయు భిన్న బోధల నుండి తొలగి, సత్య వాక్యమును సరిగ్గా విభజన చేయు అపోస్తులుల బోధలో నిలకడగా ఉండి, మన తండ్రియైన దేవుని సత్యముగా మరియు యదార్ధముగా ఆరాధించాలని  ప్రేమతో మనవి చేయుచున్నాను. 

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"క్రొత్త నిబంధనలో వాయిద్యములు?" (Musical Instruments in the new testament?)

క్రొత్త నిబంధనలో వాయిద్యములు


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి క్రైస్తవ్యములో అనేకమంది ఆరాధనలో వాయిద్యములు వాయించవచ్చని భావించి, లేని వాటిని సృష్టించి తండ్రియైన దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు.

క్రొత్త నిబంధనలో వాయిద్యములు (Musical Instruments) ఉన్నాయా..?, అపోస్తులులు కాని ఆదిమ క్రైస్తవులు కాని వాయిద్యములతో ఆరాధించారా..?, అసలు వాయిద్యములు అనే పదము క్రొత్త నిబంధన గ్రంథములో ఉందా..?, వాక్యమును పరిశీలన చేసి సత్యాన్ని అన్వేషించు ప్రతి ఒక్కరు ఈ ప్రశ్నలన్నిటికి సమాధానము లేదు అని ఖండితంగా చెప్పగలము. ఎందుకనగా, క్రొత్త నిబంధనలో ఏ సంధర్భములోను వాయిద్యములను ఉపయోగించినట్టుగా చూడలేము అసలు వాయిద్యములు అనే పదమే మనకు ఈ నిబంధనలో కనిపించదు.

క్రైస్తవులమైన మనము వాయిద్యములు వాడచ్చా?


మోషే కాలములో దేవుడు తన మందిరపు యాజకత్వపు పనిని గూర్చి మోషే కు తెలియజేస్తూ యాజకత్వపు పనిని ఆహారోను సంతతి వారు అనగా లేవీ గోత్రస్తులు మాత్రమే చేయాలని తెలియజేసారు.

» మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. – (నిర్గమ. 28:1).

యెహోవా మందిరములోనికి వెళ్ళుటకు లేవీయులకు తప్ప ఇంకెవరికిని అధికారము లేదు కనుక రాజైన దావీదు కూడా దేవుని మందిరములో వాయిద్యములు వాయించే పనిని లేవీయులకు మాత్రమే అప్పగించునట్టు గ్రంథములో చూడగలము.

» దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను. – (2 దినవృత్తా. 29:25).

పాత నిబంధనలో లేవీయులకు మాత్రమే ఇవ్వబడిన ఈ కార్యక్రమమును క్రైస్తవులమైన మనము చేయవచ్చునా అంటే చేయకూడదు ఎందుకనగా మునుపు అన్యులమైన మనము క్రీస్తు యొక్క నిబంధన రక్తము ద్వారా క్రైస్తవులుగా పిలువబడుతున్నాము కాని లేవీ గోత్రమునకు అనగా ఆహారోను సంతతికి చెందిన వారము కాము కనుక నేటి క్రైస్తవులు ఆరాధనలో వాయిద్యములు వాడకూడదు.

మనము లేవీయుల యాజకత్వమును చేయవచ్చా?


పాత నిబంధనలో లేవీయులకు మాత్రమే దేవుడు అప్పగించిన యాజకత్వపు పనిని ఆ సంతతి వారు తప్ప రాజులైనను, ఇతర గోత్రీకులైనను చేసినట్టు దాఖలు లేవు. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను మీరిన వారు శిక్ష  పొందినట్టుగా కూడా చూడగలము.

» వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. – (2 దినవృత్తా. 26:18-19).

లేవీ యాజకత్వము నేటి క్రైస్తవులకు వర్తిస్తుందా?


పాత నిబంధనలో తెలుపబడిన లేవీ యాజకత్వపు ధర్మము క్రొత్త నిబంధనలో ఎక్కడా చూడలేము. క్రైస్తవులమైన మనము రాజులైన యాజక సమూహమని  గ్రంథము తెలియజేస్తుంది, మరి మనము ఏ విధముగా దేవుని ఆరాధించాలి? మన ప్రధాన యాజకుడు ఎవరు? అనే విషయములను ఆలోచన చేస్తే గ్రంథము ఈ విధముగా సెలవిస్తుంది.

» ఆకాశమండలము గుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. – (హెబ్రీ. 4:14-15).

» అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. – (1 పేతురు. 2:9).

» నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితిమి. – (ప్రకటన. 5:9).

క్రైస్తవులమైన మనకు క్రీస్తు ప్రధానయాజకుడుగా ఉన్నాడని, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను నడిపించాడని, ఆయన రక్తము ద్వారా మనలను రాజులైన యాజక సమూహముగా చేసాడని తెలుసుకోవాలి.

» పాత నిబంధనలో ఈ ప్రధానయజకుడు తనది కాని రక్తము తీసుకొని సంవత్సరమునకు ఒక్కసారే పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించి ప్రజల కొరకు , తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయువాడు. – (హెబ్రీ. 5:3, 9:25).

» క్రొత్త నిబంధన కాలమునకు వచ్చేసరికి ఆ పనిని మన ప్రధానయజకుడైన క్రీస్తు , తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక , తన్నుతాను అర్పించుకొన్నప్పుడు  తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి యీ పని చేసి ముగించెను. – (హెబ్రీ. 7:28; 9:11,12,26-28).

పై వచనములను బట్టి క్రైస్తవులమైన మనకు లేవీ యాజకత్వము వర్తించదని ఖండితంగా నమ్మాలి. ఎందుకనగా ఈ లేవీ యాజకత్వము ఆరాధికుడికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. క్రీస్తు అను మన ప్రధానయాజకుడు ఇట్టి యాజకత్వములో చేరక మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడుగా వచ్చి యాజక ధర్మము సహా మార్చెను.

» ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక, ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవరసమేమి? ఇదియు గాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠము నొద్ద పరిచర్య చేయలేదు. – (హెబ్రీ. 7:10-12).

సత్య లేదా యదార్ధ ఆరాధికులు చేయవలసినది


క్రైస్తవులమైన మనము తండ్రియైన దేవుని మాత్రమే ఏ విధముగా ఆరాధించాలో క్రీస్తు వారు ఈ లోకములో ఉన్నపుడే మనకు తెలియజేసారు.

 యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనెను. – (యోహాను. 4:23-24).

క్రొత్త నిబంధనలో పాడుట గూర్చి మాత్రమే చూడగలము కాని వాయిద్యములు లేవనుటకు క్రింది వచనములే మనకు సాక్ష్యమిస్తున్నాయి.

★ అంతట వారు కీర్తన "పాడి" ఒలీవల కొండకు వెళ్లిరి. – (మత్తయి. 26:30).

★ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు "పాడుచు"నుండిరి. -  (అపొ.కార్య. 16:25).

★ అన్యజనులలో నేను నిన్ను "స్తుతింతును"; నీ "నామసంకీర్తనము" చేయుదును. – (రోమా. 15:9).

 ★ ఆత్మతో "పాడుదును", మనస్సుతోను "పాడుదును". – (1 కొరి౦ధి. 14:15).

 ★ మీ హృదయములలో ప్రభువునుగూర్చి "పాడుచు" కీర్తించుచు. – (ఎఫెసీ. 5:19).

★ మీ హృదయములలో దేవునిగూర్చి "గానము" చేయుచు. - (కొలస్సి. 3:16).

★ సమాజముమధ్య నీ కీర్తిని "గానము" చేతును అనెను. – (హెబ్రీ. 2:12).

★ ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు "పాడవలెను". – (యాకోబు. 5:13).

క్రొత్త నిబంధనలో చెప్పబడిన ఏ వచనములలో కూడా తండ్రియైన దేవుని వాయిద్యములతో ఆరాధించినట్టుగా చూడలేము కనుక క్రైస్తవులమైన మనము వాయిద్యములతో ఆరాధించుట వ్యర్థమైన ఆరాధనే (మత్తయి. 15:9) అగును, విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము (రోమా. 14:23)  కనుక ఆలోచన చేసి వాక్యమును పరిశీలన చేసి సత్యమును గ్రహించవలెనని మీకు మనవి చేయుచున్నాను.    

 ● కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. – (హెబ్రీ. 13:15). 


మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"పాత నిబంధనలో వాయిద్యములు" (Musical Instruments in the old testament)

పాత నిబంధనలో వాయిద్యములు


ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

మన పితరులు వివిధ సందర్బాలలో వాయిద్యములను వాయించుట మనము పరిశుద్ధ గ్రంథమందు పాత నిబంధన కాలములో చూడగలము కాని ఆరాధనలో వాయిద్యములు వాయించుట దావీదు కాలము నుండే ప్రారంభమైనదని మొదట గ్రహించాలి.

పితరుల కాలములో వాయిద్యములు :


» అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు. – (ఆది. 4:21).

మోషే కాలములో వాయిద్యములు :


» మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా. – (నిర్గమ. 15:20).

» యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలు దేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగాని లేదు. – (న్యాయాధిపతులు. 11:34).

» దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. – (2 సమూయేలు. 6:5).


పితరుల కాలములో దేవుని ఆరాధనలో వాయిద్యములు :


మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యోకోబు అనువారు యెహోవాకు బలి అర్పించినప్పుడు కాని, మరి ఏ ఇతర సందర్భములో  కాని, ఎక్కడా కూడా వాయిద్యములు వాయించినట్టుగా పరిశుద్ధ గ్రంధములో చూడలేము.

మోషే కాలములో దేవుని ఆరాధనలో వాయిద్యములు :


» నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. – (1 దినవృత్తా. 23:5).

» దహనబలి యర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. – (2 దినవృత్తా. 29:27).

మోషే కాలములో లేక ధర్మశాస్త్ర కాలములో ఆరాధనలు వాయించునట్టుగా గ్రంథములో తెలియజేయడమైనది అయితే ఈ వాయిద్యములను ఆరాధనలో ఏ సమయములో వాయించారు, వాయించే వారిగా ఎవరు నియమింపబడ్డారో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరత ఉంది.

» అంతట దావీదు మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. – (1 దినవృత్తా. 15:16).

» దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను. – (2 దినవృత్తా. 29:25).

పై వచనములో యెహోవా మందిరములో వాయిద్యములు వాయించుటకు లేవీ గోత్రపు వారు మాత్రమే అర్హులని తెలుస్తుంది.

ఈ లేవీ గోత్రస్తులు ఏ సమయములో వాయిద్యములు వాయించుటకు నియమింపబడితిరో ఆలోచన చేస్తే కేవలము  బలులు అర్పించు సమయములోనే  వాయించి తరువాత ఆ పనిని ముగించి, తలలు వంచి దేవుని ఆరాధించినట్టుగా చూడగలము.

» అంత సేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదు వారు నాదముచేయుచుండిరి,దహనబలియర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్న వారందరును తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులును లేవీయులకు ఆజ్ఞా పింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి. – (2 దినవృత్తా. 29:28-30).

గమనిక : సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే జరిగే ఆరాధనలో దహన బలులు అర్పించు సమయములో తప్ప మరి ఏ ఇతర విషయములలోనూ అనగా ప్రార్థించినప్పుడు, శ్లోకములు పాడినప్పుడు వాయిద్యములు వాయించుట మనము చూడలేము. మరొక ముఖ్య విషయము ఏమిటంటే వాయిద్యములు లేవీయులు మాత్రమే వాయించారు కాని మరింక ఎవ్వరు ఆ పనికి నియమింపబడలేదు కాబట్టి దావీదు కీర్తన గ్రంథములో కొన్ని చోట్ల స్వర మండలములతోను, పిల్లన గ్రోవితోను, సితార తోను, etc.., యెహోవాను స్తుతించుడి (కీర్తన. 150) అని ఉన్నది కాని ఆ పని అనగా వాయిద్యముల పని లేవీయుల చేయగా మిగతా వారంతా దావీదు నిర్ణయించిన పనుల చొప్పున యెహోవాను ఆరాధించిరి.

NOTE: ఆరాధనలో లేవీయులు వాయిద్యములు వాయించుట యెహోవా ఆజ్ఞ చొప్పుననే దావీదు ప్రవేశపెట్టిన వీటిని చివరికి యెహోవాయే మాన్పించినట్టుగా చూడగలము ఎందుకనగా, ఇశ్రాయేలీయులు దేవుని యెడల జరిగించిన క్రియల చొప్పున ఆయన వారికి ఈలాగు సెలవిచ్చెను.

» ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాదమికను వినబడదు. – (యేహెజ్కేలు. 26:13).

» వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు. – (యెషయా. 5:12).

» ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను. – (యెషయా. 24:8).

» మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. – (ఆమోసు. 5:23).

»  స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించు కొందురు. – (ఆమోసు. 6:5).

కాబట్టి ప్రియ సహోదరీ, సహోదరులారా పాత నిబంధన కాలములో వాయిద్యములు వాయించారు కాని ఆ పని లేవీయులు మాత్రమె చేసారు మరియు కేవలము దహన బలుల సమయములోనే చేసారని, తిరిగి యెహోవాయే వాటిని మాన్పించెనని చెప్పబడుతున్న ఈ పై వచనములను జాగ్రత్తగా పరిశీలన చేయవలెనని మీకు మనవి చేయుచున్నాను. 

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ (KM).
The churches of Christ greet you - Roma 16:16