![]() |
పాత నిబంధనలో వాయిద్యములు |
మన పితరులు వివిధ సందర్బాలలో వాయిద్యములను వాయించుట మనము పరిశుద్ధ
గ్రంథమందు పాత నిబంధన కాలములో చూడగలము కాని ఆరాధనలో వాయిద్యములు వాయించుట దావీదు
కాలము నుండే ప్రారంభమైనదని మొదట గ్రహించాలి.
పితరుల కాలములో వాయిద్యములు :
» అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక
చేయువారికందరికిని మూలపురుషుడు. – (ఆది. 4:21).
మోషే కాలములో వాయిద్యములు :
» మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను.
స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా. – (నిర్గమ. 15:20).
» యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె
తంబురలతోను నాట్యముతోను బయలు దేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ
సంతానమేగాని ఆడుసంతానమేగాని లేదు. – (న్యాయాధిపతులు. 11:34).
» దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన
సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా
సన్నిధిని నాట్యమాడుచుండిరి. – (2 సమూయేలు. 6:5).
పితరుల కాలములో దేవుని ఆరాధనలో వాయిద్యములు :
మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యోకోబు అనువారు యెహోవాకు బలి
అర్పించినప్పుడు కాని, మరి ఏ ఇతర సందర్భములో కాని, ఎక్కడా కూడా వాయిద్యములు వాయించినట్టుగా పరిశుద్ధ
గ్రంధములో చూడలేము.
మోషే కాలములో దేవుని ఆరాధనలో వాయిద్యములు :
» నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది
స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా
నియమింపబడిరి. – (1 దినవృత్తా. 23:5).
» దహనబలి యర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు
చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. – (2
దినవృత్తా. 29:27).
మోషే కాలములో లేక ధర్మశాస్త్ర కాలములో ఆరాధనలు వాయించునట్టుగా
గ్రంథములో తెలియజేయడమైనది అయితే ఈ వాయిద్యములను ఆరాధనలో ఏ సమయములో వాయించారు, వాయించే
వారిగా ఎవరు నియమింపబడ్డారో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరత ఉంది.
» అంతట దావీదు మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో
గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు
ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. – (1 దినవృత్తా. 15:16).
» దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును
చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై
అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా
ఆజ్ఞాపించి యుండెను. – (2 దినవృత్తా. 29:25).
పై వచనములో యెహోవా మందిరములో వాయిద్యములు వాయించుటకు లేవీ గోత్రపు
వారు మాత్రమే అర్హులని తెలుస్తుంది.
ఈ లేవీ గోత్రస్తులు ఏ సమయములో వాయిద్యములు వాయించుటకు నియమింపబడితిరో
ఆలోచన చేస్తే కేవలము బలులు అర్పించు
సమయములోనే వాయించి తరువాత ఆ పనిని ముగించి,
తలలు వంచి దేవుని ఆరాధించినట్టుగా చూడగలము.
» అంత సేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదు వారు నాదముచేయుచుండిరి,దహనబలియర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను. వారు అర్పించుట
ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్న వారందరును తమ తలలు వంచి ఆరాధించిరి.
దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని
రాజైన హిజ్కియాయును అధిపతులును లేవీయులకు ఆజ్ఞా పింపగా వారు సంతోషముతో స్తోత్రములు
పాడి తలవంచి ఆరాధించిరి. – (2 దినవృత్తా. 29:28-30).
గమనిక : సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే జరిగే
ఆరాధనలో దహన బలులు అర్పించు సమయములో తప్ప మరి ఏ ఇతర విషయములలోనూ అనగా
ప్రార్థించినప్పుడు, శ్లోకములు పాడినప్పుడు వాయిద్యములు వాయించుట మనము చూడలేము.
మరొక ముఖ్య విషయము ఏమిటంటే వాయిద్యములు లేవీయులు మాత్రమే వాయించారు కాని మరింక
ఎవ్వరు ఆ పనికి నియమింపబడలేదు కాబట్టి దావీదు కీర్తన గ్రంథములో కొన్ని చోట్ల స్వర మండలములతోను,
పిల్లన గ్రోవితోను, సితార తోను, etc.., యెహోవాను స్తుతించుడి (కీర్తన. 150)
అని ఉన్నది కాని ఆ పని అనగా వాయిద్యముల పని లేవీయుల చేయగా మిగతా వారంతా దావీదు
నిర్ణయించిన పనుల చొప్పున యెహోవాను ఆరాధించిరి.
NOTE: ఆరాధనలో లేవీయులు వాయిద్యములు వాయించుట యెహోవా
ఆజ్ఞ చొప్పుననే దావీదు ప్రవేశపెట్టిన వీటిని చివరికి యెహోవాయే మాన్పించినట్టుగా
చూడగలము ఎందుకనగా, ఇశ్రాయేలీయులు దేవుని యెడల జరిగించిన క్రియల చొప్పున ఆయన వారికి
ఈలాగు సెలవిచ్చెను.
» ఇట్లు నేను నీ సంగీతనాదమును
మాన్పించెదను, నీ సితారానాదమికను వినబడదు. – (యేహెజ్కేలు. 26:13).
» వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము
త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను
లక్ష్యపెట్టరు. – (యెషయా. 5:12).
» ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను. –
(యెషయా. 24:8).
» మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. –
(ఆమోసు. 5:23).
» స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించు కొందురు. – (ఆమోసు. 6:5).
కాబట్టి ప్రియ సహోదరీ, సహోదరులారా పాత నిబంధన కాలములో వాయిద్యములు
వాయించారు కాని ఆ పని లేవీయులు మాత్రమె చేసారు మరియు కేవలము దహన బలుల సమయములోనే
చేసారని, తిరిగి యెహోవాయే వాటిని మాన్పించెనని చెప్పబడుతున్న ఈ పై వచనములను
జాగ్రత్తగా పరిశీలన చేయవలెనని మీకు మనవి చేయుచున్నాను.
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ (KM).


